సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ప్రారంభమైంది.మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరుసు ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ఆక్సిజన్ ట్యాంక్ ను ప్రారంభించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ఏర్పాటు చేశామన్నారు.అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.4 శాతంగా ఉందని, కేవలం 0.6 శాతం కరోనా మరణాలు సంభవించాయన్నారు.అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో కేసుల తీవ్ర పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు ఆక్సిజన్ సరఫరా చేయాలంటే వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమస్యను పరిష్కరించేందుకు సిద్ధిపేట మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది.
ఆస్పత్రి 24 గంటలు అందుబాటులో ఉండేలా.ఆస్పత్రిలో ఉన్న మొత్తం 405 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.రూ.61 లక్షల వ్యయంతో ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించామన్నారు.సిద్ధిపేటలో వంద పడకల కోవిడ్ దవాఖానా ఉందని, కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే కోవిడ్ ఆస్పత్రిలో జాయిన్ అవ్వాలని సూచించారు.ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉందన్నారు.
ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి శాశ్వత పరిష్కారం దొరికిందని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు.ప్రజలు వైరస్ తో అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ కోవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందాలని మంత్రి సూచించారు.