అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు.మళ్ళీ గెలిచేది నేనే, వైట్ హౌస్ లో మరో నాలుగేళ్ళు ఉండేది నేనే అంటూ ఉరిమిన ఉత్సహంతో పాల్గొన్నారు.
కరోనా తరువాత దాదాపు 15 రోజుల పాటు ఎన్నికల ర్యాలీలు, సభలు నిర్వహించకుండా వైట్ హౌస్ కి పరిమితమై పోయిన ట్రంప్, మహామ్మారి నుంచీ కోలుకోగానే చాలా యాక్టివ్ గా కనిపించారు.కరోనా నుంచీ కోలుకున్న తరువాత మొదటి సారిగా ప్రజలతో పాటు బహిరంగ వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ట్రంప్.
ఫ్లోరిడా లోని సాన్ఫోర్డ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో పాల్గొన్న ట్రంప్ కరోనా నుంచీ పూర్తిగా కోలుకున్నానని, మీ అందరి ప్రార్ధనలు ఫలించబట్టి నేను ఈ రోజు మీ కళ్ళముందు ఉన్నానని తెలిపారు.ఇంకా ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదని కేవలం 20 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని మరో సారి తనకి అవకాశం ఇవ్వాలని ట్రంప్ కోరారు.
మరో నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా తానె ఉండబోతున్నానని, వైట్ హౌస్ లో మరో నాలుగేళ్ళు ఉంటానని అన్నారు.తనకి కరోనా పూర్తిగా తగ్గిపోయిందని, ఎలాంటి ఆందోళన పాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదిలాఉంటే.పనిలో పనిగా ప్రత్యర్ధి బిడెన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.చైనా తో బిడెన్ కి మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికన్స్ కోసం, అమెరికా కోసం వాటిని వదులుకోడని, అందుకు ఇప్పటివరకూ చైనాకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదని మండిపడ్డారు.వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, కరోనా సోకిన అన్ని దేశాలతో పోల్చితే అమెరికా ఆర్ధికంగా వేగంగా కోలుకుందని ట్రంప్ తెలిపారు.