రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని తరుచూ.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారు.
అంతే కాదు రైతుల సంక్షేమమే తన లక్ష్యం అని చెప్తూ వారికి ఎన్నో రాయితీలతో కూడిన పథకాలు ప్రవేశపెట్టారు.తాను కూడా చాలా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అని గర్వంగా చెప్పుకుంటారు.
తాజాగా ఆయన రైతులకోసం కొత్తగా ఓ పధకాన్ని ప్రవేశపెట్టి వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకోబోతున్నారు.
రైతులకు ఉచితంగా విధ్యుత్ పొందేలానే కాకుండా దాని ద్వారా వారు ఆదాయం పొందేందుకు అలాగే వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గ్రిడ్ అనుసంధానిత సౌర పంపుసెట్లు అందించే విధంగా సౌర సిరి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సౌర పంపుసెట్లతో రైతులు పంటల సాగుకు ఉచితంగా విద్యుత్ను వాడుకోవడమే కాకుండా మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఏడాదికి 5 నుంచి 10 వేల రూపాయలు పొందేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.రైతులు ఏడాదిలో 200 రోజులు సౌర పంపుసెట్లను వినియోగించుకున్నా… మిగిలిన 165 రోజులూ గ్రిడ్కు విద్యుత్ను విక్రయించుకోవచ్చు.ఈ పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకు గాను ఒక్కో పంపుసెట్కు రూ.3.5 లక్షల చొప్పున రూ.2625 కోట్లతో 75 వేల సౌర పంపుసెట్లను అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.దీనికి ప్రపంచబ్యాంకు, పీఎఫ్సీ, ఐఆర్ఈడీఏ, నాబార్డు వంటి సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులో డిస్కంలు ప్రాథమికంగా పెట్టుబడి పెట్టనున్నాయి.
పంపుసెట్లు ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించడంతోపాటు 15 శాతం ఎక్కువగా నీటిని తోడుతాయని అధికారులు చెప్పుకొస్తున్నారు.
ఈ పధకం అనుకున్నట్టు సక్సెస్ అయితే… సుమారు 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవడంతో ఏటా రూ.20 కోట్ల మేరకు రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే 9.62 లక్షల హెచ్వీడీఎస్ పంపు సెట్లను రైతులకు సమకూర్చారు , ఫలితంగా పంపిణీ నష్టాలు కూడా తగ్గాయి.
ఈ పధకం అమలు విధానం గురించి పంపుల తయారీదారులు, డిస్కంలు, బీమా కంపెనీలు, సౌర పంపుసెట్ల డెవలపర్లు తదితర అన్ని వర్గాల ప్రతినిధులతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ పధకం గనుక అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే రైతుల గుండెల్లో చంద్రబాబు నిలిచిపోవడమే కాదు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి రైతుల నుంచి మంచి మద్దతు లభించే అవకాశం లేకపోలేదు.