మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
బీజేపీకి వ్యతిరేకంగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి సీఎం పదవి తీసుకున్న శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు.శివసేన ఎమ్మెల్యేల్లో తనపై గూడుకట్టుకున్న అసంతృప్తిని ఏమాత్రం గమనించకుండా పాలనలో మునిగిపోయిన బాల్ థాక్రే వారసుడు ఇప్పుడు అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు.
మొత్తానికి మహారాష్ట్రలో శివసేన ఎపిసోడ్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాఠాలు నేర్పుతోంది.ఈ దుస్థితికి దారి తీసిన కారణాలను ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు చూసి జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీలో సీఎం జగన్ చాలా అలర్టుగా ఉండాలని హితవు పలుకుతున్నారు.పార్టీని పణంగా పెట్టి మరీ జగన్ పాలనపైనే దృష్టి పెట్టారని.కానీ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయిలో ఉన్న సంగతి జగన్ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మహారాష్ట్రలో దశాబ్దాలుగా పచ్చగా ఉన్న శివసేన పార్టీ ఇపుడు నిట్టనిలువుగా చీలిపోయింది.
కేవలం బాల్ థాక్రే కుటుంబ సభ్యులు, కొందరు నేతలు తప్ప శివసేన శ్రేణులంతా రెబెల్స్ అయిపోయారు.పెద్దగా ఆకర్షణ లేని రెబల్ మంత్రి ఏక్నాథ్ షిండే వైపుగా మళ్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.ఏక్నాథ్ షిండే శివసేన వారసుడు కాదు.మహారాష్ట్ర రాజకీయాలను ఫోకస్ చేయగల బిగ్ ఫిగర్ కూడా కాదు.కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఆయన మెడలో గంట కట్టారు.
ఈ పరిణామం నిజంగా ఉద్ధవ్ థాక్రే స్వయంకృతాపరాథం అనే చెప్పాలి.బాల్ థాక్రేకు ఉద్ధవ్ థాక్రే కుమారుడే కానీ అచ్చమైన రాజకీయ వారసుడు కాదని.ఆయనకు రాజకీయ మెలకువలు తెలియవని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు కూడా రాజకీయాల్లో అనుభవం లేదని.ప్రభుత్వ వ్యవహారాల్లో ఉద్ధవ్ థాక్రే భార్య రశ్మీ థాక్రే జోక్యం కూడా మహారాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేసిందని పలువురు భావిస్తున్నారు.