ఉన్నట్టుండి జనసేన పార్టీకి ఊహించని విధంగా మీడియాలో ఫోకస్ పెరిగింది.పవన్ చేసే ఉద్యమాలు కానీ, పర్యటనలకు కానీ ఎక్కడలేని కవరేజ్ ను మీడియా కల్పిస్తోంది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గా ముద్రపడిన కొన్ని చానళ్లు , పత్రికలు గత కొంతకాలంగా అదేపనిగా జనసేన కు అనుకూలం గా కథనాలు ప్రచురిస్తున్నాయి.పవన్ నీతి నిజాయితీ గల వ్యక్తి అని, ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అంటూ అదేపనిగా కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
ఒక దశలో టీడీపీకి కూడా ఇవ్వనంత ప్రాధాన్యత జనసేన పార్టీకి ఇస్తున్నాయి.అయితే ఒక్కసారిగా జనసేనకు ఈ స్థాయిలో ప్రాధాన్యం పెరగడం వెనుక కారణాలు ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.
టిడిపి కి తగ్గించి మరీ జనసేన కు ప్రాధాన్యం పెంచుతోంది.
వైసీపీ ప్రభుత్వం పై జనసేన చేస్తున్న విమర్శలకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తూ వస్తోంది.
అదే సమయంలో బీజేపీ వంటి పార్టీతో పవన్ పొత్తు పెట్టుకుని తప్పు చేశారని, పవన్ స్థాయికి బీజేపీ వంటి పార్టీ సరిపోదని, పవన్ ఎప్పటికైనా సీఎం అవుతారు అనే విషయాన్ని ,జనసేన ను అదే పనిగా హైలెట్ చేస్తూ వస్తోంది.పనిలో పనిగా పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని సైతం సదరు టిడిపి అనుకూల మీడియా అదే పనిగా హైలెట్ చేస్తోంది.
పవన్ వంటి నాయకుల మనస్తత్వానికి బిజెపి అంతగా సెట్ కాదు అని, తప్పనిసరిగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయం సదరు మీడియా పదేపదే ప్రచారం చేస్తుండడం, ఎప్పటికైనా జనసేన టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఉండడం వంటివి గత కొంత కాలంగా చోటుచేసుకుంటునే వస్తున్నాయి.అయితే ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందని, బీజేపీతో పవన్ తెగతెంపులు చేసుకుని మళ్ళీ టిడిపి తో జత కట్టే విధంగా తగిన పరిస్థితులను ఇప్పుడు కల్పించే పనిలో టిడిపి అనుకూల మీడియా తెగ హైరానా పడుతున్నట్లుగా కనిపిస్తోంది.