పెళ్లి పీటలు ఎక్కి, మంగళ సూత్రం మేడలో వేసుకోవాల్సిన ఓ యువతి అదే మెడకు ఉరి తాడు బిగించుకుని ఆత్మ హత్య చేసుకుంది.ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో అమెరికాలో స్థిరపడిన ఆమె కలలు పెళ్లి కారణంగా ఒక్క సారిగా చిద్రం అయ్యాయి, ఆమెను ఈ లోకానికి దూరం చేశాయి.
వివరాలోకి వెళ్తే.ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన సుష్మ చదువుల్లో ముందుండేది.
ఈ కారణంతోనే ఆమెను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు సుష్మ తల్లి తండ్రులు. అమెరికాలో ఆమె MS చేస్తూనే మరో పక్క ఉద్యోగం చేస్తోంది.
కరోనా సమయంలో ఏపీలో నుంచీ ఆన్లైన్ ద్వారా మొదటి సెమిస్టర్ పూర్తీ చేసిన సుష్మ రెండవ సెమిస్టర్ కోసం రెండు నెలల క్రితమే అమెరికాలోని డల్లాస్ సమీపంలో గల డెంటన్ ప్రాంతానికి వెళ్ళింది.అయితే చిత్తూరు జిల్లా పూతల పట్టు మండలం వడ్డే పల్లికి చెందిన భరత్ అనే వ్యక్తితో సుష్మ తల్లి తండ్రులు పెళ్లి సంభంధం కుదిర్చారు.
భరత్ కూడా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.దాంతో ఇద్దరూ అమెరికాలోనే ఉంటారు మంచి సంభంధం అని భావించి ఈ నెల మూడవ తేదీన పెళ్లి కి ముహూర్తం పెట్టి పెళ్లి శుభలేఖలు కూడా వేయించారు.
ఈ క్రమంలోనే భరత్ , సుష్మ ల మధ్య విభేదాలు రావడంతో భరత్ తనకు ఇప్పుడే పెళ్లి వద్దని కొంత సమయం కావాలని కోరాడు.దాంతో ఇరు కుటుంభ సభ్యులు ఇద్దరికీ నచ్చజెప్పి మరీ పెళ్ళికి సిద్దం చేశారు.
ఒక పక్క పెళ్లి పనులు జరుగుతుండగానే భరత్ మరో సారి పెళ్ళికి నిరాకరించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు.దాంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా సుష్మ తాను ఉంటున్న గదిలోనే ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.
ఈ ఘటనతో ఒక్క సారిగా ఆందోళన చెందిన కుటుంభ సభ్యులు ఆమె మృతికి కారణమైన పెళ్ళికొడుకు భరత్ పై కేసు నమోదు చేశారు.