మెగా బ్రదర్ నాగబాబు అంతా ఊహించినట్లుగానే ఎన్నికల సమయంలో అనూహ్యంగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు.నరసాపురం లోక్సభ స్థానం నుండి నాగబాబు పోటీకి సిద్దం అయ్యాడు.
అన్నయ్య నాగబాబుకు పవన్ కళ్యాణ్ నరసాపురం లోక్ సభ స్థానం ఇవ్వడంతో పాటు, అక్కడ ప్రచారం చేసి, అన్నయ్యను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అన్ని విధాలుగా అన్నయ్యను గెలిపించుకునేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కోసం ప్రచారం చేసేందుకు మెగా హీరోలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్తో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు కూతురు నిహారికలు రెండు లేదా మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక నాగబాబు గెలుపు కోసం మెగా ఫ్యాన్స్ పాటు పడాలని మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్లు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న వరుణ్ తేజ్ త్వరలోనే ఇండియాకు తిరిగి రాబోతున్నాడు.వచ్చిన వెంటనే నరసాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.పెద్ద ఎత్తున నాగబాబు ప్రచారం చేసి గెలుపొందేందుకు సిద్దం అవుతున్నాడు.
నరసాపురంలో నాగబాబు ఎంపీగా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే బాగా ప్రచారం చేయాలని జనసేన నాయకులు కూడా భావిస్తున్నారు.
ఒక వేళ నాగబాబు గెలిస్తే మాత్రం సంచలనమే అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.