జనసేన పార్టీలో కొత్త కళ కనిపిస్తోంది.వివిధ పార్టీల నాయకులు వరుసగా వచ్చి చేరుతుండడంతో ఒకరకమైన ఊపువచ్చినట్టు అనిపిస్తోంది.
ముందు ఎన్నికలకు ఒంటరిగా దిగుతామని ప్రకటించినా ఆ తరువాత వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యింది.ఆ తరువాత లక్నో వెళ్లి మరీ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.
అయినా పరిస్థితి గందరగోళంగా ఉన్నట్టే కనిపిస్తోంది.చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతోంది.
దీని కారణంగానే వేరే పార్టీల నుంచి వస్తున్న వారికి టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు.దీంతో అన్ని పార్టీల నాయకులతో జనసేన నిండిపోతోంది.
అయితే ఇదంతా గతంలో పవన్ చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది.
గుంటూరు నగర అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
గుంటూరు పశ్చిమ టిక్కట్ ను ఆశించిన ఆయనకు అది దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.మంగళవారం ఉదయం రాజీనామా చేసి సాయంత్రానికి జనసేనలో చేరిపోయి బుధవారానికి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ను సాధించగలిగారు.
అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన పార్టీలో చేరిపోయారు.ఆయన సత్తెనపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
యర్రం వెంకటేశ్వరరెడ్డి బరిలోకి దిగడం వల్ల వైసీపీ ఓట్లకు గండి పడుతుందని, కోడెలకు మేలు చేస్తుందని ప్రచారం మొదలయ్యింది.
ఇక అధినేత పవన్ అయితే బిజీ బిజీ గానే గడిపేస్తున్నారు.అభ్యర్థుల ఎంపిక మీద ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.పార్టీ జనరల్ బాడీతో పాటు కీలక నేతలంతా విజయవాడ జనసేన కార్యాలయం, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తరచూ సమావేశం అవుతున్నారు.
పెండింగ్ లో ఉన్న స్థానాలకు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే వారికి ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.అంతే కాకుండా ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన నాయకులు వస్తే వారికి టికెట్ కేటాయించేందుకు కూడా వెనుకాడడం లేదు.
ఈ విధంగానే ఇప్పటికే అనేక చోట్ల మార్పు చేర్పులు చేశారు.ఇదంతా గతం లో పవన్ చెప్పిన స్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.