జనసేన అధినేత పవన కళ్యాణ్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు.పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు.
ఈ సమయంలో ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ, వైసీపీ లను ఢీ కొట్టడంలో కాస్త వెనకబడింది అనే టాక్ బలంగా వస్తున్న నేపథ్యంలో పవన్ అనూహ్యంగా ఎవరూ కనీసం ఊహించని విధంగా లక్నో వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.అంతే కాదు మాయావతి ప్రధాని కావాలంటూ పవన్ ఆకాంక్షించారు.
పనిలో పనిగా ఆమె కూడా పవన్ సీఎం కావాలంటూ ఆమె కూడా చెప్పుకొచ్చేశారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
పవన్ పై వారు అసంతృప్తిగా ఉన్నా బహిరంగంగా నేతలు మాట్లాడకపోయినా టిక్కెట్ల ప్రకటనపై వారు ఆందోళన చెందుతున్నారు.మొదటి నుంచి తమతో పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నప్పుడు, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభ్యర్థుల ప్రకటన చేయడం ఎంతవరకు న్యాయం అని వారు ప్రశ్నిస్తున్నారు.మాయావతితో పవన్ భేటీ, బీఎస్పీతో ఏపీలో పొత్తు అంశంపై కూడా వారి స్పందన దాదాపు ఇలాంటిదే ఉందని సమాచారం.ఆయన లక్నో వెళ్తారనిగానీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నట్టు మాటమాత్రమైనా చెప్పకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు.
బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై వారికి కొన్ని సీట్లు కేటాయించబోతున్నారు అనే వాదన తెరపైకి రావడంతో తమకు కేటాయిస్తారు అని భావిస్తున్న సీట్ల కు గండిపడుతుందేమో అన్న ఆందోళన వామపక్ష పార్టీల్లో కనిపిస్తోంది.తాము కోరుతున్న స్థానాలనే బీఎస్పీ కూడా అడిగితే పవన్ స్పందన ఎలా ఉంటుందో వారికి అంచనాకు దొరకని పరిస్థితి.అయితే, బీఎస్పీతో జనసేన సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.మాయావతి, పవన్ కల్యాణ్ లు మరోసారి భేటీ అయ్యాక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నా కమ్యూనిస్టులు మాత్రం పవన్ విషయంలో గుర్రుగానే ఉన్నట్టు కనిపిస్తోంది.