వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంకు ఎలక్షన్ కమీషన్ నుండి ఏమైనా అడ్డు తగిలే అవకాశం ఉందా అని చాలా మంది భావించారు.కాని అనూహ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఎలక్షన్ కమీషన్ ఎలాంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోలేదని, సినిమా విడుదలైన తర్వాత కాని సినిమాకు సంబంధించిన అంశాలు ఏమైనా ఓటర్లను ప్రభావితం చేస్తాయా, అసలు సినిమాలో ఏమైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే విధంగా సీన్స్ ఉన్నాయా తెలిస్తేనే దానిపై చర్యలు తీసుకోగలం అంటూ చీప్ ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ అన్నారు.
ఎన్నికలు జరిగే ముందు ఈ చిత్రంను విడుదల చేయనివ్వద్దని తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్ను కోరిన నేపథ్యంలో వారికి చేదు అనుభవం ఎదురైంది.సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తానంటూ ధీమాగా చెప్పిన వర్మ అన్నట్లుగానే ఈనెల 22వ తారీకున సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.చంద్రబాబు నాయుడును విలన్గా చూపిస్తున్న దర్శకుడు వర్మ ఎలాంటి భయం లేకుండా సినిమాను వదులుతాను అంటూ చెబుతున్నాడు.పైగా ఎన్టీఆర్ వాయిస్ అంటూ చంద్రబాబు నాయుడుకు ఓటు వేయవద్దంటూ ప్రచారం చేయడంతో వర్మ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశాడో చెప్పకనే చెప్పవచ్చు.
రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే సంచలనానికి మారు పేరుగా ఉంటాయి.కాని ఈసారి మాత్రం సంచలనంను మించి ఏదైన పదం వాడాలి.ఎందుకంటే ఇప్పటి వరకు తెలియని విషయాలు, కొన్ని నిజాలను అబద్దాలుగా చూపించే ప్రయత్నాలు తాను బయటకు తీసుకు వస్తున్నట్లుగా వర్మ చేస్తున్న ప్రకటనలు సినిమాపై అంచనాలు పీక్స్కు తీసుకు వెళ్లాయి.ఎన్నికల సమయంలో ఈ సినిమా మరింత వేడి పుట్టించేలా ఉంది.
అద్బుతమైన ఈ చిత్రం నిజమైన ఎన్టీఆర్ చరిత్రను చూపిస్తుందని వర్మ చెబుతున్నాడు.ఎన్నికల కమీషన్ ఈ చిత్రాన్ని అడ్డుకోలేమని చెప్పిన నేపథ్యంలో వర్మ లోలోపల తీన్ మార్ డాన్స్ వేస్తూ ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.