ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళ్లే వామపక్ష పార్టీలు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు చూస్తున్నాయి.ఈ ఎన్నికలకు తాము ఒంటరిగానే వెళ్తామని పవన్ ప్రకటించినా వామపక్ష పార్టీలు జనసేన వెంట నడిచేలా అడుగులు వేస్తుండడంతో పవన్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాము అంటూ ప్రకటించాడు.
కాకపోతే తేడా అంతా సీట్ల దగ్గరే వస్తోంది.ఇప్పటివరకు అనేకసార్లు సీట్ల పంపకాల గురించి ప్రస్తావన వచ్చినా లెక్క మాత్రం తేలలేదు.
ఈ నెల 14 వ తేదీన జనసేన అభ్యర్థుల లిస్ట్ ప్రకటించబోతున్నందున తమ సంగతి ఏంటో తేల్చాలని పవన్ దగ్గర ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.
జనసేనతో పొత్తు అని ముందుగానే ప్రకటించుకున్న వామపక్షాలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.
అయితే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు జరగకపోవడం దీనిపై పవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు వామపక్షాలు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నాయి.పవన్ ను నమ్ముకుని రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించిన వామపక్షాలకు ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కావడంలేదు.
ఇదే విషయంపై ఇరుపార్టీల సమావేశాల్లోనూ చర్చించినట్లు తెలుస్తోంది.ఏపీలో ఈ పరిస్థితి నెలకొండడంతో సీపీఐ, సీపీఎం పార్టీల అగ్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.
ఇంకా ఈ నాన్చుడేంటి ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి అంటూ హితబోధ చేస్తున్నారు.
ఇక ఈ రెండు వామపక్ష పార్టీలు జనసేన దగ్గర పెడుతున్న డిమాండ్ ఏంటి అంటే ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో జిల్లాకు రెండు నియోజకవర్గాల చొప్పున సీట్లు కేటాయించాలని కోరుతున్నారట.దీనిపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపిన జనసేనాని తన నిర్ణయం మాత్రం ఏంటి అనేది బయటకి వెల్లడించలేదు.దీంతో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక ఈ రెండు పార్టీలు సతమతం అవుతున్నాయి.
అందుకే జనసేన ఆవిర్భావ సభకు ముందే ఏదో ఒక నిర్ణయం చెప్పేస్తే తమకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని ఒత్తిడి పెంచుతున్నారు.ఈ రెండు పార్టీలు ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పవన్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అసలు ఈ పొత్తు వ్యవహారం పవన్ కి ఇష్టం ఉందా లేదా అనే కొత్త సందేహంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి.
పవన్ ఏ స్టెప్ తీసుకుంటాడో చూడాలి.