తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.గత ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేసిన ఆ పార్టీ ఇప్పుడు మాత్రం టికెట్ల పంచాయతీలో కొట్టుమిట్టాడుతోంది.
ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను సుచాయిగా ఖరారు చేసుకున్న టీడీపీ మిగతా చోట్ల అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తి మీద సాములా మారింది.ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు గట్టిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం, టికెట్ దక్కడనుకున్న వారు తమ ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీ వైపు చూడడం ఆ పార్టీకి మింగుడుపడంలేదు.
ఇప్పటికే నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇటీవలే వైసీపీలో చేరడం టీడీపీకి పెద్ద షాకే ఇచ్చేంది.
ఇప్పుడు ఆ స్థానంలో పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది.గత ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొత్త పల్లి సుబ్బారాయుడిని ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ చూస్తోంది.అయితే ఆయన మాత్రం అందుకు ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు రగడ మొదలయిన మరో నియోజకవర్గం తాడేపల్లిగూడెం లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.జెడ్పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు (నాని) టికెట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు.
బాపిరాజుకు టికెట్ ఇవ్వాలని జిల్లా నాయకత్వం బాబుకి సూచించింది.బాబు మాత్రం ఈలి నానికి టికెట్ ఖరారు చేయడంతో అలిగిన బాపిరాజు పార్టీ మీద ఫైర్ అయిపోతున్నారు.
ఇంతకాలం తనకే టికెట్ వస్తుందన్న ఆశతో పార్టీకోసం ఎంతో కష్టపడ్డానని, చేతి చమురు కూడా బాగా వదిలించుకున్నానని , తీరా చివరి నిముషంలో కులల లెక్కలు చూపించి వేరే వారికీ టికెట్ కేటాయిస్తారా అంటూ మండిపడుతున్నారు.ఈలి నానికి టికెట్ కేటాయించినా కార్యకర్తలు సహకరించారని చెప్పుకొస్తున్నారు.తన అనుచరులతో మాట్లాడిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు మీద తగిన నిర్ణయం తీసుకుంటాను అని ఆయన ప్రకటిస్తున్నారు.ఇక కొవ్వూరు, చింతలపూడి, భీమవరం, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో సిట్టింగులకు టికెట్ కేటాయించవద్దు అంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.