ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.అధికార పార్టీ టిడిపి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఎన్నికల హామీలను ప్రకటించుకుంటూ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసుకుంటూ నువ్వా నేనా అనే రీతిలో తలపడేందుకు సిద్ధపడుతున్నాయి.
అయితే జనసేన పార్టీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నట్టు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదల దగ్గరకు వచ్చేస్తున్నా ఇంకా ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు.
ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు హామీలకు దీటుగా జనసేన హామీలు ఇవ్వలేకపోతోంది.
అసలు జనసేన ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్టే కనిపించడం లేదు.ఒకవైపు టిడిపి పది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో సమీక్షలు పూర్తిచేసి దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు.దీంతో వారు ప్రచారం మొదలు పెట్టేసి నియోజకవర్గమంతా కలియతిరిగేస్తున్నారు.
వైసిపి విషయానికి వస్తే జగన్ పాదయాత్ర సందర్భంగా దాదాపు 15 నియోజకవర్గాలు అభ్యర్థులను ప్రకటించారు.మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థులు వీరేనంటూ సంకేతాలు కూడా పంపించారు.
కానీ జనసేన ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే బాగా వెనుకబడిపోయింది.ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించినా చాలా చోట్ల ఇంకా అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.
దీంతో అసలు జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా అనే అనుమానం అందరి లోనూ కనిపిస్తుంది.
ఒక వైపు చూస్తే టిడిపి నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టిడిపిలోకి జోరుగా వలసలు సాగుతుంటే జనసేనలోకి మాత్రం ఆ సందడి కనిపించడం లేదు.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్నా జనసేనలో పవన్ తప్ప ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన మరో బలమైన నేత కనిపించడం లేదు.చెప్పుకోడానికి నాదెండ్ల మనోహర్ రావెల కిషోర్ బాబు వంటి నాయకులు ఉన్నా వారు కేవలం తమ నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల ప్రభావం చూపించలేని పరిస్థితి.175 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులు విషయాన్ని పక్కన పెడితే లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి ఒక్కరంటే ఒక్క బలమైన అభ్యర్థి కూడా కనిపించడం లేదు.వైసిపి, టిడిపిలో టికెట్లు దక్కించుకోలేని నాయకులు ఎవరైనా జనసేన లో చేరతారని ఆశతో ఆ పార్టీ ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
జనసేన తరపున పోటీచేసే అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరించే కొత్త సంప్రదాయానికి పవన్ శ్రీకారం చుట్టినా అది ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు.దరఖాస్తు చేసుకున్న వారి సామాజిక , ఆర్ధిక పరిస్థితి చూసుకుంటే ఆ రెండు ప్రధాన పార్టీలను బలంగా ఢీ కొట్టే స్థాయిలో ఉన్నవారు పెద్దగా లేరనే చెప్పుకోవాలి.
మరి పవన్ ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తాడో చూడాలి.