దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు సాధించి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు మింగుడుపడడం లేదు.తెలంగాణ విషయానికి వస్తే ముందుస్తు ఏన్నికల్లో తమ పార్టీకి అధికారం దక్కడం ఖాయం అని ఆ పార్టీ పెద్దలు అంచనా వేశారు.
అయితే ఆ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు తగాదాలు తదితర కారణాల వలన పరాజయం పాలయ్యింది.ఇక మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.
ఈ సమయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన నాయకులు ఒకరి మీద మరొకరు ఆధిపత్యం సాదించేందుకు పోటీలు పడుతుండడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
మరీ ముఖ్యంగా… ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది కీలక నాయకులు పార్టీలో కొనసాగుతారా లేదా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.బలమైన నాయకులందరికీ టీఆర్ఎస్ పార్టీ గాలం వెయ్యడం కాంగ్రెస్ పెద్దలకు రుచించడంలేదు.రేగా కాంతారావు, ఆత్రం సక్కు.
ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ ఇద్దరూ సొంత పార్టీ తీరుపై గడచిన కొద్ది రోజులుగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
అయితే, పార్టీ మారుతున్నట్టు ప్రకటించకపోయినా, సొంత పార్టీపై దాడికి దిగుతుండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.వీరితో పాటు మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో కొంతమంది, నల్గొండ జిల్లాలో ఓ కీలక నేత కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేందుకు రెడీ అయినట్టు చర్చ జరుగుతోంది.అయినా వారిని కట్టడి చేసేందుకు గట్టి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీలో ఐక్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.దీంతో సొంత పార్టీలో ఉన్న టీఆర్ఎస్ కోవర్టులను గుర్తించడమే ఇప్పుడో కొత్త సమస్యగా కాంగ్రెస్ పార్టీకి మారింది.
ఒక వైపు చూస్తే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో వచ్చేట్టుగా ఉంది .ఈ పరిస్థితుల్లో పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితులు పుండు మీద కారం జల్లినట్టుగా ఉన్నట్టు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.