మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా తోటి మనిషి ప్రాణానికి అంత విలువనిస్తాడు.అయితే ఆ విలువను తెలుసుకున్న వారే తోటి మనుషులకు సహాయం చేస్తారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎవరినైనా ప్రాణాలకు తెగించి రక్షించేందుకు పోరాడుతారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం, చూపించిన తెగువ అలాంటివి మరి.!
వివరాల లోకి వెళ్తే…నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్ గ్రామంలో ఇటీవల ఓ సంఘటన జరిగింది.
ఆ గ్రామంలో ఉన్న కాకతీయ కాలువ వద్ద ఓ వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అనుకోకుండా ప్రమాదవశాత్తూ ఆ వ్యక్తి కాలువలో పడిపోయాడు.దీంతో పక్కనే వెళ్తున్న పదో తరగతి విద్యార్థి కునాల్ అతన్ని రక్షించబోయి తాను కూడా కాల్వలో పడిపోయాడు.
కునాల్ను, ఆ వ్యక్తిని చూసిన దేవదాస్ అనే మరో వ్యక్తి కూడా రక్షించేందుకు ప్రయత్నించి కాలువలో పడ్డాడు.ఇలా ముగ్గురు కాలువలో కొట్టుకుపోతుండడాన్ని గమనించిన స్థానికులు పెద్దగా కేకలు పెట్టారు.
అయితే అదే సమయంలో స్థానికంగా ఉంటున్న చాయా బాయి అనే మహిళ అటుగా వచ్చింది.కాలువలో కొట్టుకుపోతున్న ముగ్గుర్ని చూసింది.వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వారిని రక్షించేందుకు ముందుకు సాగింది.చుట్టూ అందరూ ఉన్నారు, తాను మహిళ అని కూడా చూడకుండా ఒంటికి ఉన్న చీరని తీసి కాలువలోకి విసిరింది.
దీంతో ఆ చీరను పట్టుకున్న ముగ్గురూ బయటికి వచ్చారు.వారిని లాగేందుకు ఒడ్డున ఉన్న ఇతర వ్యక్తులు కూడా సహాయం చేశారు.ఈ క్రమంలో చాయా బాయిని అందరూ అభినందించారు.చీరను విసిరి ముగ్గురి ప్రాణాలను కాపాడినందుకు ఆమెను స్థానికులు పొగిడారు.
చాయా బాయి తెగువను, ధైర్యాన్ని నిజంగా మనం కూడా అభినందించాల్సిందే.!
.