ఆలయ విస్తరణ కోసం నిధుల సేకరణ
సౌత్ ప్లైన్ఫీల్డ్: ఫిబ్రవరి 7: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక సాయినాథుడు.భక్తులు ఎలా కోరుకుంటే అలా దర్శనమిచ్చాడు.
భక్తులను పరవశులను చేశాడు.అన్ని మతాల సారం ఒక్కటే అని చాటిన ఆ మహిమాన్వితుడు సాయి నాధుడి సందేశాన్ని చక్కటి నృత్య రూపకంగా మార్చి అమెరికాలో సాయి సమర్పణ్ బృందం 65 మంది సుశిక్షుతులైన సాయిభక్త కళాకారులతో ప్రదర్శిస్తోంది.
సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో సౌత్ ప్లైన్ఫీల్డ్ హై స్కూల్, న్యూజెర్సీ లో మే నెల 4 వతేదీన ఏక్ మే అనేక్ ఆంగ్ల భాషలో (వన్ ఇన్ మెనీ ) బ్రాడ్ వే షో లను తలపించే ప్రదర్శన జరగనుంది.దీని కోసం సాయి దత్త పీఠం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.అన్ని మతాలవారినీ ఈ వేదికకు రప్పించి సాయి సందేశాన్ని చాటేందుకు ప్రచారాన్ని చేపట్టింది.పెద్ద ఎత్తున భక్తులు ఈ ఏక్ మే అనేక్ కార్యక్రమానికి రావాలని సాయి దత్త పీఠం ఆహ్వానం పలుకుతోంది.
ఈ సందర్భంగా ప్రాంక్లిన్ టౌన్ షిప్ మేయర్ ఫిలిప్ క్రామర్, న్యూజెర్సీ పబ్లిక్ యూటిలిటీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల ఏక్ మే అనేక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు ధర్మశ్రీ రఘు శర్మ శంకరమంచి టికెట్ వివరాలు తెలియచేసారు.రఘుశర్మ మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు చూసి తీరవలసినదని ప్రత్యేకంగా తెలియచేసారు.
దీంతో పాటు అమ్మ, నాన్న ఆశ్రమం కోసం సాయి దత్త పీఠం ప్రతీ సంవత్సరం చేసే ఆర్ధిక సహాయంలో భాగంగా సేకరించిన 2100 డాలర్ల విరాళాలను మేయర్ ఫిలిప్ క్రామర్ చేతుల మీదుగా నిర్వాహకులకు అందించారు.ఆ తర్వాత ఆధ్యాత్మిక అంశాల పట్ల తనకున్న మక్కువను క్రామర్ వివరించారు.ఏక్ మే అనేక్ అర్థం తెలుసుకుని… ఇది ఎంతో మంచి కార్యక్రమంగా భావించి నేను ఇక్కడకు వచ్చానని తెలిపారు.
దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
సాయి భక్తులలో ఒకరైన హేమంత్ పంత్ రాసిన సాయి సత్ చరిత ఆధారంగా ఈ ఏక్ మే అనేక్ రూపకం రూపుదిద్దుకుంది.యువకులు, చిన్నారులు దాదాపు 65 మంది ఈ నృత్యరూపకంలో సాయి సందేశాన్ని హృదయాలకు హత్తుకునే విధంగా చెప్పబోతున్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లను సాయి దత్త పీఠం ఇప్పటికే పీఠం లోనూ ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంచింది.
సులేఖ వెబ్ సైట్ లో కూడా వీటిని పొందే అవకాశం కల్పించింది.ఏక్ మే అనేక్ కార్యక్రమం కు వచ్చిన నిధులను సాయి దత్త పీఠం సాయి ఆలయ విస్తరణ కోసం వినియోగించనుంది.