హోరాహోరీగా ఉండబోతున్న ఏపీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమది అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఈ మేరకు పక్క పార్టీని మించి మరింత ముందుకు వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి గట్టెక్కాలని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.మొన్నటి వరకు టీడీపీకి గెలుపై ధీమా ఉండేది.
అయితే… ఈ మధ్యకాలంలో జనసేన,వైసీపీ పార్టీలు బలంగా పుంజుకోవడం…ముఖ్యంగా అసలు పోటీలోనే లేదు అనుకున్న జనసేన పార్టీ రాజకీయంగా బలపడడంతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి.అందుకే జనసేనాని కి పోటీగా టీడీపీ కూడా మరో స్టార్ హీరోని టీడీపీ తరపున ప్రచారానికి దించాలని చూస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి పవన్ కళ్యాణ్ దోహదపడ్డాడు.అతని సహకారంతోనే అధికారం కూడా చేపట్టింది.అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారవడంతో పవన్ కి చెక్ పెట్టేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా మహేశ్ మావాడే అనే సంకేతాలు పంపే పనిలో చంద్రబాబు ఉన్నారట.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు త్వరలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.టీడీపీ నేతల బృందం బుర్రిపాలెం వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనుంది.
బుద్ధా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్ తదితరులు ఇందుకోసం బుర్రిపాలెం వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
ఆయనను పార్టీలో చేర్చుకోవడం ద్వారా… కృష్ణ ఫ్యాన్స్ తో పాటు మహేష్ అభిమానుల ఓట్లను కూడా పొందవచ్చని టీడీపీ ఆలోచన చేస్తోంది.ఇప్పటికే మహేశ్ బావ గల్లా జయదేవ్ టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు.2014 ఎన్నికల్లో మహేశ్ తన బావ కోసం ప్రచారం కూడా చేశారు, కానీ రాజకీయాలేమీ పెద్దగా మాట్లాడలేదు.ఈసారి మహేశ్ బాబాయిని కూడా తమ పార్టీలోకి రప్పించడం … అలాగే వచ్చే ఎన్నికల్లో మహేష్ తో ప్రచారం చేయించడం ఖాయం అంటూ టీడీపీ ముఖ్య నేతలు బలంగా చెప్తున్నారు.
అయితే స్వతహాగా రాజకీయాలకు దూరంగా ఉంటూ… లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే మహేష్ టీడీపీ కోసం ప్రచారం చేస్తాడా .? అనే డౌట్ కి అందరిలోనూ తెలెత్తింది.అయితే మహేష్ బాబాయ్ , బావ కోసం అయినా ఆయన తప్పకుండా ప్రచారానికి వస్తాడని… ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా కనిపిస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది.