తెలంగాణలో పంచాయతి ఎన్నికల సందడి జోరుగా ఉంది.నిన్న అంటే జనవరి 21న మొదటి దశ ఎన్నికలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలు కూడా వచ్చేశాయి.
పార్టీలతో సంబంధం ఉండని ఎన్నికలైనా కూడా ఈ ఎన్నికలు మొత్తం కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చుట్టు తిరిగాయి.మొదటి దశలో ఎక్కువగా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకున్నారు.
గెలిచిన వారు ఆనందంలో మునిగి పోగా, ఓడిపోయిన వారు మాత్రం బాధ పడుతున్నారు.అయితే యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపురం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
జీవితంలోనే మర్చి పోలేని తప్పు చేశామని ఆవేదన చెందుతున్నారు.తమ ఊరి చరిత్రలోనే తమను ఇకపై జోకర్స్ గా చూస్తారని, తమపై ప్రతి ఒక్కరు జాలి చూపుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.రంగాపురం గ్రామంలో మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డిలు సర్పంచ్ బరిలో నిలిచారు.ఇద్దరు కూడా హోరా హోరీగా తలపడ్డారు.ఇద్దరు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది.హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో రామిడి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఒక్క ఓటు తేడా ఉండటంతో రీ కౌంటింగ్ కూడా పెట్టించారు.
అయినా కూడా ప్రభాకర్ రెడ్డికే ఎక్కువ ఓట్లు దక్కాయి.దాంతో ఆగంరెడ్డి ఓడిపోయాడు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే ఆగంరెడ్డి దంపతులు ఓటర్లను బూతుల వద్దకు పంపించడం, వారిని తమకే ఓటు వేయండి అంటూ చెప్పడం కోసం ఊర్లో తిరిగారు.ఆ క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం మర్చి పోయారు.
సమయం గడిచి పోయే వరకు కూడా వేద్దాం, వేద్దాం అనుకుంటూ ఓటు వేయకుండా ఉండి పోయారు.దాంతో వారు ఓటు వేయలేక పోయారు.ఓటు వేయకున్నా తాము గెలుస్తామని వారు ధీమాగా ఉన్నారు.అయితే ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో తమ రెండు ఓట్లు పడితే ఒక్క ఓటు తేడాతో మనమే గెలిచే వాళ్లం కదా అంటూ ఆగంరెడ్డి దంపతులు కుమిలి కుమిలి ఏడ్వబట్టిరి.
ఇప్పుడు వారికే కాదు, అందరికి కూడా ఒక్క ఓటు విలువ ఎంతనో తెలిసి ఉంటుంది.అందుకే ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కును వినియోగించుకోవాలి.మన ఒక్కరి ఓటుతో ఏం మారుతుంది లే అనుకునే వారికి ఇదే పెద్ద సమాధానం.
మిగిలిన రెండు దశల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అయినా మీ ఓటు హక్కును వినియోగించుకోండి.
ఓటు హక్కు అవగాహణ కోసం ఈ విషయాన్ని స్నేహితులతో షేర్ చేయండి.