ఏపీలో ఎన్నికల ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుండడంతో ….అన్ని రాజకీయ పార్టీల్లోనూ… సందడి వాతావరణం నెలకొంది.
ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు … పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.మొన్నామధ్యనే … తెలంగాణాలో ఎన్నికల తంతు ముగియడంతో… అక్కడ ముగిసిన హడావుడి ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది.
ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు….అభ్యర్థుల ప్రకటనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాయి.
ఈ నేపథ్యంలో మరోసారి ఏపీలో సర్వే సంస్థల సందడి కనిపిస్తోంది.ఈ సర్వే సంస్థల ఫలితాల ఆధారంగానే… పార్టీలు టికెట్లు కేటాయించడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.
అందుకే ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఏపీలో రాజకీయాలను అంచనా వేసేందుకు సిద్ధం అయిపోతున్నాయి.
అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ప్రజల ఆదరాభిమానాలు ఎవరికి ఉన్నాయి… ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న నేత ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏ నాయకుడి వైపు ఎక్కువగా ఉన్నారు.
ఏ నేతకు జై కొడుతున్నారో… తెలుసుకునే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నం అయిపోయాయి.అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాన వనరుగా ఎంచుకుని సర్వేల బాట పట్టాయి.
ఆన్లైన్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల నాడిని అంచనా వేస్తున్నాయి.బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసుకునేందుకు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సర్వే సంస్థలనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాయి.
అసలు ఇప్పటికే ఏపీ అధికార పార్టీ టీడీపీ అనేకానేక సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అలాగే… వైసీపీ తరఫున ఇప్పటికే ప్రశాంత్కిషోర్ టీమ్ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి ఆ మేరకు నివేదికలను పార్టీకి అందించింది.జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలోనూ ఒక సర్వే నిర్వహించినట్లు ఆ పార్టీ నేతల్లో చర్చ సాహుతోంది.అలాగే… బీజేపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది.ఇక అనేక సర్వే సంస్థలు ఏపీలో పలానా పార్టీ గెలవబోతోంది… ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనేది సర్వేల పేరుతో రిజల్ట్స్
ప్రకటించడం మరింత గుబులు రేపుతోంది.దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కూడా అన్ని పార్టీలు సతమతం అవుతున్నాయి.టీడీపీ – కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండగా… జనసేన వామపక్ష పార్టీలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.ఇక వైసీపీ జనసేన పొత్తు పై చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో… ఈ రెండు పార్టీలు పొత్తుపై ఒక క్లారిటీ రావడంలేదు.