సోషల్ మీడియా…లిమిట్ లో వాడితే పర్లేదు…కానీ అదుపుతప్పితే జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది అని ఓ యువతి నిరూపించింది.ప్రేమముసుగులో తల్లిని ఖూనీ చేసింది.
ప్రేమ అంటే వారు కలుసుకొని ఒకరి మనసు ఒకరు తెలుసుకునే లాంటి ప్రేమ కాదు.ఫేస్బుక్ లో మాత్రమే పరిచయం.
ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదు.అలాంటి ప్రేమకాని ప్రేమ కోసం ఆ యువతి తల్లిని ఖూనీ చేసింది.
ప్రియుడి స్నేహితుడితో తల్లిని హత్య చేసింది.తర్వాత గంటకో ట్విస్ట్ అన్నట్టు సదరు నిందితురాలు పోలీసులకు చుక్కలు చూపింది.
చివరికి పోలీసులు మిస్టరీ ఛేదించారు.ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.
తమినాడులోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు ఆంజనేయపురం 8వ వార్డుకు చెందిన తిరుముగన్నాథన్ (65), భానుమతి దంపతులకు చాముండేశ్వరి (24), దేవీప్రియ (19) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.దేవీప్రియ పట్టాభిరామ్ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన సురేష్తో ప్రేమలో పడింది.
రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన సురేష్ గతంలో ఆవడిలో పని చేసేవాడు.ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటిలోని నిప్పాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.దేవీప్రియ అతణ్నే పెళ్లి చేసుకోవాలనకుని ఇంట్లోంచి నగలు, డబ్బులతో ఉడాయిస్తుండగా తల్లి అడ్డుపడింది.దీంతో సురేశ్ ద్వారా ఇద్దరు కుర్రాళ్లను పిలిపించుకుని తల్లిని హత్య చేయించింది.తర్వాత పోలీసుల విచారణలో అబద్ధాలు చెప్పింది.తాను సురేశ్ను కాకుండా వివేక్ అనే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది.
చాటింగ్ వివరాలకు, యువతి ఇస్తున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో పోలీసుల విచారణకు ప్రధాన అడ్డంకిగా మారింది.మొదట తిరుప్పావణం ప్రాంతానికి చెందిన వివేక్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది.దీంతో పోలీసులు వివేక్ నంబర్ను చేదించి విచారణ చేయగా అతనితో చాలా తక్కువ సమయం మాట్లాడినట్టు గుర్తించారు.దీంతో అనుమానించిన పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేపట్టి అసలు విషయాన్ని రాబట్టారు.