ఈమద్య కాలంలో వరుసగా తుఫాన్లు జన జీవనంను అస్థవ్యస్థం చేస్తున్నాయి.గతంలో అయితే తుఫాన్ల రాకను కనిపెట్టలేక పోయారు కనుక భారీ ఎత్తున ఆస్తి నష్ట మరియు ప్రాణ నష్టం జరిగేది.
అప్పట్లో ఆంధ్రాలో వచ్చిన దివిసీమ తుఫాన్ కారణంగా ఎంత భారీ నష్టం వాటిల్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కారణం అప్పుడు ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రభుత్వాలు అప్రమత్తం చేయలేక పోయాయి.
కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వారం రోజుల ముందే తుఫాన్ను శాటిలైట్స్ పసికడుతున్నాయి.
దాంతో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు.
ఇంత ముందు తెలిసినా కూడా కొందరు అలసత్వం మరియు బద్దకంతో కొందరు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోక పోవడంతో ఆ సమయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఏపీతో పాటు తెలంగాణను కూడా వణికిస్తున్న పెథాయ్ తుఫాన్ మరి కొన్ని గంటల పాటు తీవ్రంగా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపించబోతుంది.
ఆ తుఫాన్ తో పాటు భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు ముందస్తు చర్యలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండటం ఎలాగో ఇప్పుడు చూద్దాం… తుఫాన్ సమయంలో ఎక్కువగా ఆహారం, తాగడానికి నీరు ఇబ్బంది అవుతుంది.తుఫాన్ తీరం తాకేముందు ఖచ్చితంగా భారీగా వర్షాలు వస్తాయి.అందుకే మూడు నాలుగు రోజులకు సరిపడా ఆహారంను ముందే సిద్దంగా ఉంచుకోవాలి.
తాగేందుకు నీరు కూడా రెడీగా ఉంచుకోవాలి.ఆ ఆహారంను మరియు తాను నీటిని ఎంత సాధ్యం అయితే అంత ఎత్తులో పెట్టాలి.
తుఫాన్ సమయంలో కరెంట్ కట్స్ ఎక్కువగా ఉంటాయి.అందుకే మొబైల్స్ మరియు బ్యాటరీ లైట్లు ఎప్పటికప్పుడు ఫుల్ చార్జ్ చేసుకోవాలి.ఇంటి చుట్టు పక్కల ఉన్న చెట్లను ఒకసారి గమనించడం మంచిది.ఎందుకంటే భారీ గాలులకు విరిగి పోయే ప్రమాదం ఉంది.అందుకే ముందస్తుగానే వాటి కొమ్మలను తొలగిస్తే ఉత్తమం.
ఇంటి పై కప్పు అంతా సరిగా ఉందా, ఇల్లు గోడలు నీళ్లు ఏమైనా లోనికి వచ్చే అవకాశం ఉందా అనే విషయాలను కూడా గుర్తించాలి. విపత్తు సమయంలో ఎలాంటి పుకార్లు లేదంటే వార్తలను ఇతరులకు పంపించొద్దు.అలా పంపిస్తే మొత్తం గందరగోళం అవుతుంది. ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండటం వల్ల ఇబ్బంది ఉండదు.బయటకు వెళ్తే గాలి, వానకు ఏ ప్రమాదమైన జరిగే అవకాశం ఉంది. ఇళ్లు నీటిలో మునిగి పోతుందని భావించినప్పుడు వెంటనే ముఖ్యమైన సామాను అంతా కూడా ఎత్తైన ప్రదేశంకు తీసుకు వెళ్లాలి. ఈ ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల తుఫాన్ నుండి ఆస్తి, ప్రాణనష్టంను తప్పించుకోవచ్చు.
అందరికి ఉపయోగపడే ఈ సమాచారంను స్నేహితులతో షేర్ చేసుకోండి.