మొన్నటి వరకు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ… తమలో తమకే అభిప్రాయాలు కలవక కలిసే ఉన్నా… ఎడమొఖం పెడమొఖంగా ఉన్నా .మహాకూటమిలోని పార్టీలు పోలింగ్ తేదీ దగ్గరకు విచ్చేస్తున్న తరుణంలో తమ కీచులాటలకు పులిస్టాప్ పెట్టేసినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే తెలంగాణాలో… అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది.ఈ క్రమంలో మహా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత ఉంటుందా.ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా వీరంతా కసిలిమెలిసి ఎన్నికల బరిలో నిలుస్తారా అనే అనుమానాలు అందరికి వచ్చాయి.అయితే… తమలో తాము చిన్న చిన్న తగువులు అడ్డుకున్నా… తమ అందరి లక్ష్యం టీఆర్ఎస్ ఓటమే అన్నట్టు పార్టీలు ప్రకటించాయి.
ఇప్పటి వరకు కాంగ్రెస్ తీరుపై టీజేఎస్ అధినేత కోదండరామ్ కు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ,అవేవి మనసులో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నారు.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే… కూటమిలోని పార్టీలకు కాంగ్రెస్ కేటాయించిన స్థానాల్లో రెబెల్స్ బరిలోకి దిగడంతో అంతా టెన్షన్ పడ్డారు.అయితే… రెబెల్స్ గా బరిలోకి దిగిన వారితో నామినేషన్లను ఉపసంహరింపజేయడం కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పు తిప్పలు పడి మరీ వారిని బతిమలాడి ఒప్పించి నామినేషన్స్ ఉపసంహరించేలా చేయగలిగారు.
కూటమి పొత్తులో భాగంగా శేర్లింగంపల్లి సీటు టీడీపీకి దక్కింది.దీంతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ నేత భిక్షపతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్, జైరామ్ రమేష్ లు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ నచ్చజెప్పారు.అలాగే… మేడ్చల్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో కూడా రెబెల్స్ ను ఇలాగే బుజ్జగించారు.ఇక ఇబ్రహీపట్నం లో టీడీపీ అభ్యర్థి సామా రంగారెడ్డి నామినేషన్ వేశారు.
కానీ, కాంగ్రెస్ కి చెందిన మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి నామినేషన్ వేశారు.అయితే, ఆయనతో నామినేషన్ ను విత్ డ్రా చేయించే ప్రయత్నాలు ఫలించలేదు.
వరంగల్ వెస్ట్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డితో కూడా చర్చలు జరిపి, ఆయన్ని బుజ్జగించగలిగారు.పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు.