తెలంగాణాలో గత కొంతకాలంగా చడీ చప్పుడు లేకుండా ఉన్న నక్సల్స్ మళ్ళీ తమ ఉనికి అడపాదడపా చాటుతూనే ఉన్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతోపాటు… ఆ ప్రాంత నాయకులకు రక్షణ పెంచారు.
ప్రస్తుతం … తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లిలో మావోయిస్టుల హెచ్చరికలు అలజడి సృష్టిస్తున్నాయి.ముందస్తు ఎన్నికలు బూటకమనీ, వాటిని బహిష్కరించాలని పిలుపునిస్తూ మావోయిస్టులు వేసిన పోస్టర్లు, కరపత్రాలు అలజడి రేపుతున్నాయి.జిల్లాలోని చర్ల, వెంకటాపురం, మహదేవ్ పూర్, కాటర్ మండలాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని చోట్ల ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు కరపత్రాల్లో పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికలు ప్రజాస్వామ్యనికీ విరుద్దంగా ఉన్నాయని ఏటూరు నాగారం – మహదేవ్పూర్ ఏరియా కమిటీ పేరుతో ఈ కరపత్రాలు బ్యానర్లు వెలిశాయి.టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ జనసమితీ సహా అన్ని పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని కరపత్రాల్లో మావోయిస్టులు వెల్లండించారు.ఇలాంటి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.