టీటీడీ వివాదం ఏ ముహూర్తాన రాజుకుందో తెలియదు కానీ ప్రతి రోజు దీని మీద ఏదో ఒక వార్త బయటకు వస్తూనే సంచలనం సృష్టిస్తున్నాయి.టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని మీడియా కి ఎక్కి మరీ ఆరోపణలు చేసి కోర్టు వరకు ఆ వివాదం వెళ్లేలా చేసిన టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మళ్ళీ తెర మీదకు వచ్చారు.
కొన్నిరోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయ ప్రవేశం నిలిపివేయబోతున్నట్టు టీటీడీ ప్రకటించడంతో దీక్షితులు కొన్ని ఆరోపణలు గుప్పించారు.
గతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరుమల గురించి చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని, తిరుమల ఆభరణాలను దోచుకుంటారని గతంలోనే పోతులూరి వారు చెప్పారని రమణ దీక్షితులు గుర్తు చేశారు.
తిరుమలను కాపాడుకునేందుకు భక్తులందరూ ముందుకు రావాలన్నారు.మహాసంప్రోక్షణ సమయంలో భక్తులు కొండపైకి రావాలని, స్వామివారి దర్శనం కోసం ప్రయత్నించాలని రమణదీక్షితులు పిలుపునిచ్చారు.
తిరుమల చరిత్రలో ఒక అసాధారణ, సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, తిరుమలలో మహాసంప్రోక్షణ సమయంలో సీసీ కెమెరాలు నిలిపివేస్తామని చెప్పడం, ఉద్యోగులను సెలవుపై పంపడం వంటి చర్యలు అనేక అనుమానాలకు కలిగిస్తున్నాయని దీనిపై పూర్తి వివరాలు అందరికి తెలియజేయాలని దీక్షితులు డిమాండ్ చేస్తున్నారు.తిరుమల నుంచి ఆభరణాలను తరలిస్తున్నారంటూ తాను చేసిన ఆరోపణలకు టీటీడీ చర్యలు బలం చేకూరుస్తున్నాయన్నారు.టీటీడీ ఆభరణాలపై సుప్రీం కోర్టును సుబ్రమణ్యం స్వామి ఆశ్రయిస్తుండడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మహా సంప్రోక్షణ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉందన్నారు.
టీటీడీ లో ఉన్న బోర్డు సభ్యులు ఎవరికీ ఆధ్యాత్మిక చింతన లేదని, టీటీడీ చైర్మన్కు అసలు హిందూమతంపైనా, తిరుమలపైనా అవగాహన లేదన్నారు.
ప్రస్తుతం నియమించిన బోర్డులోని వారంతా రాజకీయనాయకులేనన్నారు.చెన్నై నుంచి వచ్చిన ఒక బృందం శ్రీవారి ఆలయం కింద ఏముందన్న దానిపై పరిశోధన చేసిందన్నారు.వీటన్నింటిని బట్టి చూస్తుంటే తిరుమల సంపదను దోచుకునే కుట్రకు పూనుకున్నారని అర్ధం అవుతోందన్నారు.నేను లేవనెత్తిన అంశాలపై వివాదం రేగడంతో తిరిగి కొందరు భక్తులకు మహాసంప్రోక్షణ సమయంలో అనుమతిస్తారని ముఖ్యమంత్రి చెబుతున్నారని.
అయితే ఆ కొంతమంది భక్తులు ఎవరన్నది కూడా చెప్పాలని దీక్షితులు డిమాండ్ చేసారు.