కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంతో ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు.ముద్రగడ ఉద్యమంపై రకరకాల సందేహాలు, విమర్శలు కూడా ఉన్నాయి.
ఏవి ఎలా ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున కాకినాడ లోక్సభ సీటును ఆశిస్తున్నారని ఈ మేరకు జగన్కు ఆయనకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు ఏపీ పొలిటికల్ ఇన్నర్ కారిడార్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ముద్రగడ వైసీపీ ఎంట్రీ ఇచ్చి కాకినాడ నుంచి పోటీ చేస్తారనే వార్తే ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద ముసలానికి కారణమైనట్టు వార్తలు వస్తున్నాయి.
కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాపుల ఓట్లు ప్రాబల్యం చాలా ఎక్కువ.అందుకే కాపు నాయకులు వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
గతంలో ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పని చేసిన పళ్లంరాజు రెండుసార్లు గెలిచారు.ఇప్పుడు టీడీపీ నుంచి ఎంపీగా ఉన్న తోట నరసింహం సైతం కాపు సామాజికవర్గానికి చెందిన వారే.
ఇక ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నారై, కాపుల్లో మంచి పట్టు ఉన్న యువనేత చలమలశెట్టి సునీల్ రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఎలాగైనా ఎంపీ కావాలని కలలు కంటోన్న ఆయన 2009లో కాకినాడ నుంచి ప్రజారాజ్యం తరపున ఎంపీగా పోటీ చేశారు.
గత ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయనకు కాకినాడ లోక్ సభ సీటు దక్కకపోవచ్చని తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితమే జగన్ ఇదే విషయాన్ని సునీల్కు చెప్పినట్టు తెలుస్తోంది.ముద్రగడ అంతటి వ్యక్తి ఆ సీటు అడిగితే ఆయన్ను కాదని నీకు ఈ సీటు ఇవ్వనని సునీల్కు జగన్ చెప్పేశారట.
కాకినాడ ఎంపీ సీటుకు బదులుగా పిఠాపురం లేదా మరెక్కడైనా ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పారట.జగన్ నిర్ణయంపై సునీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
తనకు ఎంపీ అవ్వాలనే ధ్యేయమని.అందుకోసమే గత పదేళ్లుగా ఇక్కడ పని చేసుకుంటున్నానని.
ఇప్పుడు తనను ఇలా తప్పించడం ఏంటని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.ఏదేమైనా ముద్రగడకు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చే అంశంపై అప్పుడే వైసీపీలో ముసలం మొదలైందని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు.