ఏపీలో కాపు ఉద్యమాన్ని ఒక్కసారిగా పీక్ స్టేజ్కు తీసుకువెళ్లిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.ముద్రగడ వైసీపీలోకి వెళతారని, ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ నేతల డైరెక్షన్లోనే ఆయన నడుస్తున్నారని టీడీపీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తుని ఘటన తర్వాత ఆయన పూర్తిగా వైసీపీ కంట్రోల్లోకి వెళ్లిపోయారన్న చర్చలు కూడా నడిచాయి.ఇక తాజాగా ఆయన తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర తలపెట్టడంతో ఏపీలో కాపు ఉద్యమం మరోసారి హీటెక్కుతుందా ? అన్న సందేహం వ్యక్తం అయ్యింది.
అయితే ప్రభుత్వం ముందుగానే ఆయన్ను హౌస్ అరెస్టు చేయడంతో ఆయన పాదమాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది.ముద్రగడ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు.వాస్తవానికి ముద్రగడను జనాలు మర్చిపోయారు.అయితే కాపు ఉద్యమం ఎఫెక్ట్తో ఆయన ఒక్కసారిగా తిరిగి వెలుగులోకి వచ్చాడు.
ముద్రగడ ఎఫెక్ట్ తర్వాత కాపులను బీసీల్లో చేర్చే అంశంపై టీడీపీ మరింత నాన్చుతోంది.ఇప్పటికిప్పుడు కాపులను బీసీల్లో చేరిస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్న ఆలోచనతో చంద్రబాబు వ్యూహాత్మకంగా కాపు కార్పొరేషన్ ఏర్పరిచి కాపులకు రుణాలు ఇవ్వడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వార్ ఇలా జరుగుతుండగానే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం మొదలైంది.చేరే ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి .వచ్చే నెల 23వ తేదీన ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వైసీపీలో చేరితే ముద్రగడకు జగన్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభ టిక్కెట్టు ఆఫర్ చేసినట్టు టాక్.ఆయన గతంలో కూడా అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు.1999లో ముద్రగడ టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తోట సుబ్బారావుపై 1.21 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు.ఈ క్రమంలోనే కాపుల్లో ఇప్పుడు బాగా క్రేజ్ మ్యాన్గా మారిన ముద్రగడను తన పార్టీలో చేర్చుకుని సరైన ప్రయారిటీ ఇస్తే కాపుల్లో వైసీపీకి బలమైన నాయకుడు దొరికినట్లవుతుందన్నదే జగన్ ప్లాన్గా తెలుస్తోంది.
ఇక ముద్రగడతో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వైసీపీలో చేరనున్నారని సమాచారం.