ఓపిక నశిస్తే ఎవరైనా కఠినంగా, కరుకుగా మారతారు.మెత్తగా ఉన్నవారు కూడా నియంతగా మారతారు.
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అదే చేశారు.ఆమెకు ఓపిక నశించడంతో గొడవ చేసిన పాతిక మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు.
సహజంగానే ఇది కాంగ్రెసుకు, మరికొన్ని పార్టీలకు కోపం తెప్పించింది.కాని స్పీకర్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు.తాను ఎనిమిది రోజులు ఓపిక పట్టిన తరువాత ఇంత కఠిన చర్య తీసుకున్నానని అన్నారు.‘అవును….ఇది కఠిన చర్యే’ అని వ్యాఖ్యానించారు.స్పీకర్ అనేకసార్లు హెచ్చరించినా సభ్యులు వినలేదు.నల్ల బ్యాండ్లు కట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని గొడవ చేశారు.ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన గొడవ.‘సభను జరగనివ్వం’ అని అని పదే పదే చెప్పి గొడవ చేశారు.వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు.ఇరవైఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేయగానే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోపం వచ్చింది.‘ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ అని వ్యాఖ్యానించారు.సభ నుంచి కాంగ్రెసు బాయ్కాట్ చేసింది.వామపక్షాలు సహా ఇతర పార్టీలన్నీ కాంగ్రెసుతో జత కలిశాయి.సభ్యలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.నిజమే…మంచిది కాదు.ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదు.కాని సభను జరగనివ్వకుండా గొడవ చేయడం కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా.