రాజ్యసభకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిదే విజయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ….
తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసేందుకు చంద్రబాబు నాయుడు పన్నుతున్న కుయుక్తులు పారబోవని అన్నారు.తెలుగుదేశం పార్టీ పెద్ద తప్పు చేసామని కొందరు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, ఇప్పటికే వారంతా తమతో టచ్లో ఉన్నట్లు వారు వెల్లడించారు.
రాజ్యసభ ఎన్నికల్లో తమ సభ్యుని గెలుపు ఏనాడో ఖరారై పోయిందని, వత్తిళ్లకు లొంగే వారెవ్వరూ పార్టీలో లేరన్న సంగతి తెలుసుకోవాలని వారు చంద్రబాబుకు సూచించారు.నాలుగో సీటు కోసమంటూ పార్టీ మారిన సభ్యులను తన వెంట తిప్పుకుంటున్న చంద్రబాబు నిజస్వరూపం ఇప్పటికే తమకు దూరమైన సభ్యులకు అర్ధమైందని వ్యాఖ్యానించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), టీజీ వెంకటేష్ (టీడీపీ), సురేష్ ప్రభు (బీజేపీ), విజయ సాయిరెడ్డి (వైఎస్ఆర్ సీపీ)లు మాత్రమే నామినేషన్లు వేయటంతో ముగిసిన ప్రక్రియ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పా… వీరి గెలుపు ఏకగ్రీవం కానుండటం గమనార్హం.