సాధారణంగా రామాలయం లేని ఊరు ఉండదు.ఆ రామాలయంలో తప్పనిసరిగా హనుమంతుని విగ్రహం ఉంటుంది.
ఆ హనుమంతుని విగ్రహానికి సిందూరం పూసి ఉండటం చూస్తూనే ఉంటాం.కొంత మంది హనుమంతునికి సిందూరం ఇష్టమని భావిస్తారు.
మరి కొంత మంది అది ఆచారంగా భావించి హనుమంతునికి సింధూరం అభిషేకం చేస్తూ ఉంటారు.
అయితే ఈ ఆచారం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
ఒక రోజు సీతమ్మ వారు నుదిటిన సిందూరం పెట్టుకోవటం హనుమంతుడు చూస్తాడు.అది చూసి హనుమంతుడు సీతమ్మను సిందూరం ఎందుకు పెట్టుకున్నారని అడుగుతాడు.
అప్పుడు సీతమ్మ తల్లి సిందూరం సౌభాగ్యానికి ప్రతీక అని నుదిటిన సిందూరం పెట్టుకుంటే భర్త ఆయుషు పెరుగుతుందని వివరించింది.
దాంతో హనుమంతునికి రాములవారి ఆయుష్షు పెరగడానికే సీతమ్మ తల్లి సిందూరం ధరిస్తుందని అర్ధం అవుతుంది.
హనుమంతుడు హడావిడిగా వెళ్ళిపోయి కొంతసేపు అయ్యాక వచ్చిన హనుమంతుణ్ణి చూసి సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయింది.ఎందుకంటే హనుమంతుడు ఒళ్లంతా సిందూరాన్ని పూసుకొని రావటమే అందుకు కారణం.
సీతమ్మ తల్లి హనుమంతుణ్ణి ఎందుకు సిందూరం పూసుకున్నావని అడిగితే రాముడి ఆయుష్షు పెరగాలనే తాను సిందూరాన్ని పులుముకున్నాననీ, ఇక మీదట సిందూరం లేకుండా కనిపించనని హనుమంతుడు అన్నాడట.దాంతో సీతమ్మ ఆనందంతో చిరంజీవిగా సిందూరాభిషేకాలు అందుకోమంటూ హనుమంతుణ్ణి దీవించిందట.
ఆలా హనుమంతునికి సిందూరం అభిషేకం చేయటం ఆచారంగా మారిపోయింది.