ఏపీలో విపక్ష వైసీపీకి వరుస కష్టాలు పట్టుకున్నాయి.ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
ఈ క్రమంలోనే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వారు సైతం తమకు ప్రాధాన్యత లేకపోవడం, పదవులు రాకపోవడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా ? పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే అవుననే సందేహాలు ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో ఫైర్బ్రాండ్ ఎవరంటే మనకు ముందుగా నగరి ఎమ్మెల్యే ఆర్కె.
రోజా గుర్తుకు వస్తారు.అయితే అదే పార్టీలో మరో ఫైర్బ్రాండ్ కూడా ఉన్నారు.
ఆమె ఎవరో కాదు వాసిరెడ్డి పద్మ.మీడియాలో వైసీపీ వాణి బలంగా వినిపించడంలో వాసిరెడ్డి పద్మ చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ల కన్నా ఎంతోముందు ఉంటారు.
ఆమె గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ సీటు ఆశించినట్టు ప్రచారం జరిగింది.
ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ఆమెకు హామీ ఇచ్చారట.
అయితే ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ కాదు కదా…ఆమె పేరును కూడా జగన్ పరిగణలోకి తీసుకోలేదట.దీంతో పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా.
పార్టీ అధినేత తనను పక్కన పెట్టడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్రెడ్డితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆళ్ల నానిలను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
మహిళా కోటాలో తన పేరు కూడా పరిగణలోకి తీసుకోకపోవడం వాసిరెడ్డి పద్మను తీవ్రంగా బాధించినట్టు సమాచారం.జగన్ తీరు గతంలోనూ ఇలాగే ఉందని… ప్రస్తుతం కూడా ఏ మాత్రం మార్చుకోలేదని పద్మ వాపోతున్నారట.
ఇలాంటి పార్టీలో ఎంత కష్టపడినా ఉపయోగం లేదని.పార్టీ మారే ఆలోచనలో ఆమె ఉన్నట్టు వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
మరి పద్మలో అసంతృప్తిని జగన్ చల్లార్చే ప్రయత్నం చేస్తారా ? లేదా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పేస్తారా ? అన్నది చూడాలి.