ఏపీలో గత సాధారణ ఎన్నికలు తర్వాత మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి.వీటిల్లో ఆళ్లగడ్డలో మాత్రం భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నందిగామ, తిరుపతి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.
ఈ ఉప ఎన్నిక ఇలా ఉండగానే నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా మరో రెండు ఉప ఎన్నికలకు తెరలేచింది.ఇక్కడ సవాళ్ల రాజకీయంలో అదే కర్నూలు జిల్లాలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే ఛాన్సులు ఉన్నాయి.
ఈ ఉప ఎన్నిక వేళ ఇక్కడ రాజకీయం హోరాహీరోగా సాగుతోంది.అధికార టీడీపీ నుంచి దివంగత భూమా అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పోటీపడుతున్నారు.
ఈ క్రమంలోనే శిల్పా మోహన్రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి షాక్ ఇస్తూ వైసీపీలోకి జంప్ అయ్యారు.
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.
తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ చెప్పడంతో తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటించాడు.ఆయన మూడు నెలల క్రితమే ఎమ్మెల్సీగా మారారు.
ఇక శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి రాజకీయ ప్రత్యర్థి అయిన బుడ్డా రాజశేఖర్రెడ్డి కూడా శిల్పా చక్రపాణిరెడ్డికి సవాల్ విసిరారు.
తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తిరిగి ఇద్దరం శ్రీశైలంలో పోటీ చేద్దామని సవాల్ విసిరారు.
గత ఎన్నికల్లో రాజశేఖర్రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి చక్రపాణిరెడ్డిపై గెలిచారు.అనంతరం ఆయన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీడీపీలో చేరిపోయారు.ఇక ఇటు చక్రపాణిరెడ్డి, అటు రాజశేఖర్రెడ్డి ఇద్దరి రాజీనామాలు ఆమోదం పొందితే నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగానే రెండు ఉప ఎన్నికలు రావడం తథ్యం.ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ అదిరిపోతోంది.