తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పుడు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహాలు టీ పాలిటిక్స్ ఇంటర్నల్ చర్చల్లో వినిపిస్తున్నాయి.ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలపై ఓ రేంజ్లో దుమ్మెత్తిపోసిన నేతలు అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల పాటు బాగానే తమ వాయిస్ వినిపించారు.
అలాంటి నేతలు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో అసలు ఏమైందా ? అని అందరూ ఆరాలు తీయడం స్టార్ట్ చేసేశారు.
గతంలో కేసీఆర్ను కాని, టీఆర్ఎస్ను కాని చిన్న మాట అంటేనే అంతెత్తున విరుచుకుపడే నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ను, కేసీఆర్ను ఎన్ని మాటలంటున్నా అస్సలు నోరు మొదపడం లేదు.
ఇందుకు ప్రధాన కారణం అసంతృప్తేనని తెలుస్తోంది.కేవలం సీనియర్ నేతలే కాదు మంత్రులదీ అదే దారి.కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని కట్టకలిపి ఎవరైనా విమర్శలు చేసినా ఏ ఒక్క మంత్రి మాట్లాడడం లేదు.వీరంతా తమ శాఖలకే పరిమితమవుతున్నారు.
మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి వంటి నేతలు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బాగా యాక్టివ్గా ఉండేవారు.విపక్షాల విమర్శలను ఓ రేంజ్లో తిప్పికొట్టేవారు.ఇప్పుడు వారు ఏం మాట్లాడడం లేదు.శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, జీవన్రెడ్డి కూడా తెరవెనక్కు వెళ్లిపోయారు.
పల్లా రాజేశ్వర్, కర్నె ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లాంటి వాళ్లు మాత్రం అప్పుడప్పుడు తమ వాయిస్ వినిపిస్తున్నారు.
చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు గంపా గోవర్థన్, గొంగిడి సునీత వారి నియోజకవర్గాలకే పరిమితమై విపక్ష విమర్శలను తిప్పికొట్టడంపై శ్రద్ధ పెట్టడం లేదు.
ఇక చాలా మంది మంత్రులు సైలెంట్ అవ్వడం వెనక తాము మంత్రులుగా ఉన్నా తమకు పూర్తి స్వేచ్ఛ నివ్వకపోవడం, కేసీఆర్ కుటుంబ పెత్తనం బాగా ఎక్కువవ్వడం లాంటి కారణాలతోనే వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.