ఇతర పార్టీల నాయకులను వలలో వేసుకోవడానికి గులాబీ పార్టీ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.పార్టీ అధినేత కేసీఆర్కు ఇదొక తీరని దాహంగా ఉంది.
గులాబీ పార్టీలో ఒరిజినల్ నాయకుల కంటే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.ఏ తరహా ఎన్నికలు వచ్చినా ముందుగా ఇతర పార్టీల నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తుంది గులాబీ పార్టీ .ఏ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారా అని భూతద్దం వేసి చూస్తూ ఉంటుంది.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, అ తరువాత జరిగే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల కోసం నాయకుల వేట మొదలు పెట్టింది.
ఇతర పార్టీల నాయకులను లాక్కొని ఆ పార్టీలను బలహీన పరచడం గులాబీ పార్టీ అధినేత లక్ష్యం.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు నాయకుల కోసం వెదుకుతున్నట్లు సమాచారం.
దీన్నే మీడియా వారు ఆపరేషన్ ఆకర్ష అంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శాసన మండలిలో 12 సీట్లకు పోటీ జరగబోతున్నది.
మొత్తం సీట్లు గెలుచుకొని ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని కెసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం బలమైన నాయకులు కావాలి.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోనే బలమైన నాయకులు ఉన్నారు.ఇప్పటివరకు గులాబీ పార్టీలో చేరినవారు ఆ రెండు పార్టీల నాయకులే.
చేరిన వారిలో కొందరికి పదవులు దక్కాయి.ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల కోసం మరి కొందరిని గుంజుకుంటే ఆ రెండు పార్టీలు బలహీనంగా మారుతాయని, తనకు పోటీ ఉండదని గులాబీ పార్టీ భావిస్తోంది.