డ్రగ్స్ ఉదంతంలో ఎక్కడో తీగ లాగుతుంటే ఎక్కడో కదులుతోంది.టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలుగుతోంది.
ఇన్విస్టిగేషన్ అధికారులకు తీవ్రస్థాయిలో బెదిరింపులు రావడం ఇందుకు ఊతమిస్తోంది.హైదరాబాద్లోను, టాలీవుడ్లోను డ్రగ్ రాకెట్ను బయటపెట్టి సంచలనాలకు కారణమైన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు బెదిరింపులు వచ్చాయి.
ఇంటర్నెట్ కాల్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అకున్ను బెదిరించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఎలెర్ట్ అయ్యారు.అకున్ సబర్వాల్ పిల్లలను టార్గెట్ చేస్తూ ఆగంతుకులు బెదిరించినట్లు చెబుతున్నారు.
మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసని చెప్పడంతో పాటు ఆగంతకులు ఆఫ్రికన్ భాషలో ఆగంతకులు మాట్లాడడంతో డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ ముఠా పని చేస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి.
ఇక విచారణను నిలిపి వేయాలంటూ అకున్కు బెదిరింపులు కూడా వస్తున్నాయి.
గత వారం రోజులుగా వరుసగా కాల్స్ వస్తున్నా వీటిని సీరియస్గా తీసుకోని అకున్ ఇప్పుడు వీటిపై సీరియస్గా దృష్టి సారించారు.అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో ? తెలుసుకునేందుకు అకున్ హైదరాబాద్లో పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు వాటి మూలాలను కూడా వెతికి వెతికి మరీ పట్టుకుంటున్నారు.
అకున్ దెబ్బతో చాలా మంది ప్రముఖుల పేర్లు సైతం బయటపడే ఛాన్సులు ఉండడంతో డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగిందని పోలీసులు భావిస్తున్నారు.కెల్విన్ డ్రగ్స్ దిగుమతి చేసుకునే నెదర్లాండ్స్, ఐరోపా వంటి దేశాల నుంచే ఈ ముఠా ఎక్కువగా డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.