తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ‘అన్నం ముట్టకూడదు’ అని నిర్ణయించుకున్నాడు.కేసీఆర్ అలిగారు.
అయితే భార్య మీదనో, కూతురు, కొడుకు మీదనో కాదు.కేంద్ర ప్రభుత్వం మీద.అన్నం ముట్టుకోకపోవడమంటే నిరాహారదీక్ష చేయడం అని అర్థం.మనలాంటివారికి కోపం వస్తే ‘అన్నం తినను పో’ అంటాం.
కాని రాజకీయ నాయకులు నిరాహారదీక్ష చేస్తారు.కేసీఆర్కు ఎందుకు కోపం వచ్చిందంటే….
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఎనిమిదిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.సెక్షన్ ఎనిమిది అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతలు పర్యవేక్షించే బాధ్యత రాష్ర్ట గవర్నర్కు అప్పగించడం.
రెండు రాష్ర్టాల పోలీసు అధినేతలు ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి.గవర్నర్ ఆదేశాలను వారు అమలు చేయాలి.
అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘డమ్మీ’ అవుతారు.ఓటుకు నోటు వివాదం నేపథ్యంలో సెక్షన్ ఎనిమిది అమలు చేయాలని ఏపీ డిమాండ్ చేసింది.
దీన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో నిరాహారదీక్ష చేయాలనుకుంటున్నారు.అక్కడ చేస్తే జాతీయ మీడియాలో ఎక్కువ ప్రచారం లభిస్తుంది.
కేంద్ర పాలకులే అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే దృష్టి పెడతారు.శాంతిభద్రతల వ్యవహారం గవర్నర్కు అప్పగించడమంటే సీఎంను పనికిరాకుండా చేయడమే.
ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం.సెక్షన్ ఎనిమిది అమలు చేయాలని నిర్ణయించుకుంటే తాను జాతీయ స్థాయిలో ఉద్యమం లేవదీస్తానని కేసీఆర్ చెప్పారు.
నిజానికి గత ఏడాదిగా నగరంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి.ప్రజలు ప్రశాంతంగానే బతుకుతున్నారు.
ఒకవేళ కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే ఇది రెండోసారి అవుతుంది.తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా నిరాహార దీక్ష చేశారు.
ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు.మరి ఇప్పుడు ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
.