కొంతమంది ఏళ్ళ తరబడి రాజకీయాల్లో ఉన్నా మంత్రులు కాలేరు.కానీ ఇలా రాజకీయాల్లోకి రావడం … అలా మంత్రులు అయిపోవడం జరుగుతుంది.
దీన్నే అదృష్టం అంటారు.బీహారులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులకు అదృష్టం అరచేతి మందాన పట్టింది.తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కావడం వారి జీవితాలను మలుపు తిప్పింది.30 ఏళ్ళు నిండకుండానే ఒక కొడుకు మంత్రి అయ్యాడు.ఇంకో కొడుకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.ఎన్నికల్లో మొదటిసారి గెలవగానే పదవులు అలంకరించడం విశేషమే.ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మూడో వ్యక్తిగా లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ (28) ప్రమాణ స్వీకారం చేసాడు.కానీ ఇతని ప్రమాణ స్వీకారం తప్పుల తడకగా సాగింది.
ఆపెక్షిత్ అనే పదానికి బదులు ఉపెక్షిత్ అని చదివాడు.గవర్నర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించినా తప్పుగానే పలికాడు.
ఆదిలోనే హంసపాదు పడింది.ఇతనికి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో తడబడ్డాడా? పదాన్ని సరిగా చదవలేకపోయాడా? తెలియదు.రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పరిపాలన ఎలా చేస్తాడో.పదవులు చేపట్టాలనే తొందర ఉంటుందిగాని దానికంటే ముందు కొంత రాజకీయ అనుభవం సంపాదించాలనే ఆలోచన ఉండదు.
తండ్రి లాలూకే ఇలాంటి ఆలోచన లేనప్పుడు కుమారులకు ఎందుకు ఉంటుంది? చిన్న కుమారుడు తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్ట బోతున్నాడు.ఇతని వయసు 26 ఏళ్ళు.
ఇంత చిన్న వాళ్లకు, మొదటిసారి ఎన్నికై రాజకీయ అనుభవం లేనివాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం నితీష్ కుమారుకు ఇష్టం ఉండకపోవచ్చు.కాని తన పార్టీ జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు సాధించిన లాలూ ప్రసాద్ డిమాండును కాదనే దమ్ము నితీష్కు లేదు.
ఇది సంకీర్ణ ప్రభుత్వం.ప్రధాన భాగస్వామి లాలూ ప్రసాద్.
అతనితో పెట్టుకుంటే ఇంతే సంగతులు.సర్దుకొని పోక తప్పదు.