ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయం.ఎమ్మెల్యే భూమాకు సంతాపం తెలిపే విషయంలో కూడా విపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చాలా కఠినంగా వ్యవహరించడంతో పాటు నంద్యాల సీటు మాది…అక్కడ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రధాన ప్రతిపక్షమే పోటీ చేస్తామని చెప్పడంతో నంద్యాల ఉప ఎన్నిక రసవత్తంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
నంద్యాలలో 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.
అయితే కొద్ది రోజుల క్రితం ఆయన తన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి టీడీపీలోకి జంప్ చేసేశారు.కొద్ది రోజుల్లో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకుంటున్న టైంలో ఆయన హఠాత్తుగా మృతిచెందారు.
ఈ క్రమంలోనే నంద్యాలలో అభ్యర్థి ఎంపికకు అప్పుడే వైసీపీ కసరత్తులు ప్రారంభించేసిందట.
ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్రెడ్డితో పాటు నంద్యాల వైకాపా లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్గోపాల్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ప్రస్తుతం ఇక్కడ భూమా కుటుంబానికి సానుభూతి ఉంటుంది.అయితే ఇప్పుడు పోటీచేసిన వారికే 2019లో కూడా సీటు ఇస్తానని జగన్ చెప్పడంతో వైసీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తితో ఉన్నారు.
ఇక టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ నుంచి ఆయన రెండో కుమార్తె లేదా తనయుడిని రంగంలోకి దింపుతుందా ? లేదా శిల్పా సోదరుల్లో ఎవరో ఒకరు రంగంలో ఉంటారా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు.టీడీపీ వర్గాల ఇంటర్నల్ టాక్ ప్రకారం భూమా ఫ్యామిలీపై ప్రస్తుతం ఇక్కడ సానుభూతి బాగా ఉంది.
అందుకే భూమా చిన్న కుమార్తె రంగంలో ఉంటారని సమాచారం.