ఎన్నికలు సమీపించే తరుణంలో వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు చేయని ప్రయత్నాలంటూ లేవు.ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఏకంగా 29 మంది ఎమ్మెల్యేలను ఆయన సైకిలెక్కించేసుకున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా సైకిలెక్కేయడంతో కాస్త డీలా పడ్డ జగన్ ఇప్పుడు ప్లీనరీ తర్వాత, ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చాక కాస్త ఉత్తేజంతో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న వైసీపీకి మరిన్ని షాకులు ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎట్టిపరిస్థితుల్లోను వైసీపీ బలోపేతం అయ్యేందుకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదని భావిస్తోన్న బాబు ఇప్పుడు మరో ఆపరేషన్కు తెరలేపినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ విడత ఆపరేషన్ ఆకర్ష్లో గుంటూరు నగర ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు ఇలా ఉండగానే ఇప్పుడు వైసీపీలో గతంలో కీలకపాత్ర పోషించి ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటోన్న ముగ్గురు కీలకనేతలపై బాబు కన్ను పడినట్టు తెలుస్తోంది.
వారికి వేరే ఆప్షన్లు లేవు కనుక టిక్కెట్ వారికే ఇస్తామని దూతలను వారివద్దకు పంపినట్లు సమాచారం.ఉత్తరాంధ్రలో బలమైన నాయకులుగా కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, దాడి వీరభద్రరావులు ఉన్నారు.
అయితే ఇందులో దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నా తర్వాత వైసీపీలోకి వెళ్లారు.గత ఎన్నికల్లో ఆయన తనయుడు రత్నాకర్ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం ఆయన జగన్తో విబేధించి బయటకు వచ్చారు.ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు.
ఇక వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొణతాల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయుడు.వైఎస్ మరణానంతరం జగన్ పార్టీలో చేరిన కొణతాల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకున్నా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు.ఇక జగన్ను ఆకాశానికి ఎత్తేసిన సబ్బం హరి ఇప్పుడు ఆయనకు దూరంగా ఉంటున్నారు.
వీరి ముగ్గురిని టీడీపీలో చేర్చుకుంటే జగన్ గుట్టును రట్టు చేయడానికి చాలా వరకు యూజ్ అవుతోందని బాబు భావిస్తున్నారట.ఈ క్రమంలోనే వీరికి టిక్కెట్లు ఆఫర్ చేసి టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.