తెలుగుదేశం పార్టీ కి తెలంగాణలో ఏకైక మల్కాజ్ గిరి లోక్ సభ ఎంపీ చామకూర మల్లారెడ్డి ఈ రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఇటీవలే తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొన్న టీడీపీ కి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరేందుకు సిద్దమైన విషయం విదితమే.
గత కొన్ని రోజులు క్రితం తెలంగాణకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం కేసీఆర్ అని మల్కాజిగిరి సభలో ముఖ్యమంత్రి సమక్షంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమైంది.ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని, అనుచరులతో మంతనాలు జరుపుతున్నారంటూ వచ్చిన కథనాలను ఖండన ప్రకటనలు గుప్పించారు.
అయితే మహానాడు నుంచి వచ్చిన తదుపరి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, తెరాసకు ప్రజల్లో పెరుగుతున్న ఆధరణ ఉందని భావించి, తన సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు చేసినట్టు తెలుస్తోంది.దీనికి తోడుగా మహానాడులో తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు నేతలతో తీర్మానాలు చేయించటంపైనా మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేయటం, పార్టీ మారడమే సరైందన్న భావనకు వచ్చినట్లు తెలిసింది.
ఈ విషయమై స్వయంగా తానే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2 న మల్లారెడ్డి గులాబీ కండువాను కప్పుకోవాలని తొలుత భావించినా, ముఖ్యమంత్రి సూచనల మేరకు నేటి ఉదయం 11గంటలకు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో .పార్టీలో చేరనున్నట్లు తెలుస్తొంది.ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అణుచర గణం, తెలుగుదేశం క్యాడర్ కూడా కారెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.