తెలంగాణలో టీడీపీ ఉండకూడదనేది టీఆర్ఎస్ లక్ష్యం.ఆ లక్ష్య సాధనలో భాగంగానే ఇప్పటికే కొందరు ‘పచ్చ’ ఎమ్మెల్యేలకు ‘గులాబీ’ రంగు పూసింది.
ఇంకా కొందరికి పూసేందుకు సిద్ధంగా ఉంది.కేవలం ఎమ్మెల్యేలనే కాదు, బలమైన టీడీపీ నాయకులను కూడా తనలో కలిపేసుకుంటోంది.
హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వగా, ప్రజాప్రతినిధి కాని ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావును కూడా చేర్చుకొని మంత్రి పదవి కట్టబెట్టారు.టీడీపీ ఎమ్మెల్యేలను ఏదో రకంగా పార్టీలో చేర్చుకోవడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీఆర్ఎస్ తమను బెదిరిస్తోందని, ఒత్తిడి తెస్తోందని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతుండగా, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే టీఆర్ఎస్లో చేరక తప్పదని ఇంకొందరు అంటున్నారు.ఈ స్టేట్మెంట్లు టీడీపీ నాయకులే సొంతంగా ఇస్తున్నారో, టీఆర్ఎస్ నాయకులు ఇప్పిస్తున్నారో తెలియదు.
తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయిన ప్రకాశ్ గౌడ్ చేసిన ప్రకటన చూస్తే ఈయన కూడా టీఆర్ఎస్లోకి వెళతారేమోనని అనిపిస్తోంది.తాను టీఆర్ఎస్లో చేరాలంటే ప్రభుత్వం తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని అన్నారు.
నియోజవర్గంలోని అన్ని ఇళ్లకు మంచి నీటి సౌకర్యం కల్పించాలంటే మూడొందల పద్నాలుగు కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు.ఈ అంశాన్ని మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని టీడీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు.
టీడీపీ ఇబ్ర హీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈమధ్యే టీఆర్ఎస్లో చేరారు.తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంకు నిధులు కేటాయిస్తే తాను టీఆర్ఎస్లో చేరతానని షరతు విధించి, సీఎం దానికి అంగీకరించారని చెప్పి గులాబీ పార్టీలో చేరిపోయారు.
ప్రకాశ్ గౌడ్ వైఖరి కూడా అదేవిధంగా ఉండటంతో టీడీపీని వీడుతారనే అనుమానం కలుగుతోంది.ఏదో ఒక సాకు చెప్పి టీఆర్ఎస్లోకి పోవడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నేతలు.