తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత తీసికట్టుగా తయారవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.గత ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు, మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు (రేవంత్రెడ్డి – సండ్ర వెంకట వీరయ్య – ఆర్.కృష్ణయ్య ) మాత్రమే మిగిలారు.
వీరిలో రేవంత్ ఒక్కడే కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా స్ట్రాంగ్ ఫైట్ చేస్తుండగా ఓటుకు నోటు కేసు తర్వాత సండ్ర బాగా సైలెంట్ అయ్యాడు.ఇక బీసీ సంఘం నేతగా ఉన్న ఆర్.
కృష్ణయ్య టీడీపీలో ఉన్నాడా ? లేడా ? అన్న డౌట్లు వస్తున్నాయి.ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమై చాలా రోజులైంది.
టీడీపీకి వరుసగా తగులుతున్న షాకుల పరంపరలోనే కృష్ణయ్య సైతం చంద్రబాబుకి బై చెప్పేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే బాబు, కృష్ణయ్య మధ్య దూరం గ్యాప్ బాగా పెరిగిపోయింది.
కొద్ది రోజుల క్రితం కృష్ణయ్య ఓ పరీక్ష విషయంలో విద్యార్థులకు సపోర్ట్గా మాట్లాడుతూ చంద్రబాబును చీల్చి చెండాడారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు సైతం సిద్ధమని ప్రకటించారు.
అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న బాబు – కృష్ణయ్య బంధం ఆ తర్వాత మరింత పెద్దదైంది.ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరుతారని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కృష్ణయ్య జాతీయ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కృష్ణయ్యతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగానే ఆయన బీజేపీ ఎంట్రీపై చర్చ జరిగిందట.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగుర వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం కృష్ణయ్యను తమ పార్టీలో చేర్చుకుని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చిందట.
మరి కృష్ణయ్య ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.