ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని కేంద్రం నాన్చుతుండగానే ఆశావాహులు మాత్రం గంపెడాశలతో తమకు సీటు రాకపోతుందా ? అసెంబ్లీలో అడుగుపెట్టకపోతామా ? అని కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పడే కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో ఇద్దరు వారసులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీకి రాజధానిగా ఏర్పడిన అమరావతి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడనుంది.ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వారసులు రంగంలో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనయుడు యరపతినేని మహేష్, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు ఇద్దరూ రేసులో ఉన్నారు.
వీరిలో రాయపాటి వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ టిక్కెట్టు వద్దని…తనకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చి తన కుమారుడు రంగారావుకు అమరావతి కేంద్రంగా ఏర్పడే అసెంబ్లీ సీటు లేదా మరో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతున్నారు.
ఇక గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ వద్ద మంచి పలుకుబడి ఉంది.
మంత్రివర్గ విస్తరణలో యరపతినేనికి మంత్రి పదవి రాకపోయినా ఆయన అధిష్టానంపై ఏ మాత్రం అలకబూనలేదు.
చంద్రబాబుకు ఆయన అత్యంత నమ్మకస్తుడు.లోకేశ్కు యరపతినేని కుమారుడు మహేష్కు సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
దీంతో మహేష్ సైతం అమరావతి టిక్కెట్టు ఆశిస్తున్నారు.మరి ఈ ఇద్దరు వారసుల్లో ఎవరికి వచ్చే ఎన్నికల్లో ఈ సీటు దక్కుతుంది ? వీరి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది చూడాలి.