ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీలో ఇంటర్నల్ ఫైటింగ్ ఓ రేంజ్లో జరుగుతోంది.చిత్తూరులో టీడీపీ గత దశాబ్దంన్నరగా వీక్గానే ఉంటోంది.
ప్రస్తుతం ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా అంతటా గ్రూపు రాజకీయాల రాజ్యం నడుస్తోంది.చంద్రబాబు సైతం వీటిపై పెద్దగా కాన్సంట్రేషన్ చేయకపోవడంతో జిల్లా అంతటా నాయకులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది.
పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా వారి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పురాకపోగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తమ కళ్లముందే ఎదిగిపోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో దశాబ్దాల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి వాళ్లకే పదవులు ఇవ్వడంతో పాతవాళ్లు రగిలిపోతున్నారు.
శ్రీకాళహస్తిలో నిన్నటి వరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధిపత్యం కొనసాగినా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎన్సీవీ వర్గం పట్టు సాధిస్తోంది.చంద్రబాబుతో ఈయనకు నేరుగా ఉన్న పరిచయంతో ఆయన దూసుకుపోతుండడం బొజ్జలకు మింగుడు పడడం లేదు.
సత్యవేడులోనే ఎమ్మెల్యేకు, ద్వితీయ శ్రేణి నాయకులకు అస్సలు పడడం లేదు.
నగరి నియోజకవర్గంలో ఇటీవల చంద్రబాబు అశోక్ రాజుకు ప్రాధాన్యత ఇవ్వడంతో గాలి కినుక వహించారు.
దీంతో పాటుగా ముద్దు కృష్ణమ నాయుడి చిరకాల ప్రత్యర్థి చెంగారెడ్డి కుటుంబీకులను టీడీపీలో చేర్చుకునేందుకు బాబు ఓకే చెప్పారన్న వార్తలతో గాలి బాబుపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారట.జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కుతూహలమ్మ వర్గానికి, పాత సైకిల్ బ్యాచ్కి మధ్య అసలు పొసగడం లేదు.
పలమనేరులో వైసీపీ నుంచి అమరనాథ్ రెడ్డి చేరికతో అప్పటి వరకూ అక్కడ పార్టీకి పనిచేసిన బోస్ వర్గం ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరమైంది.సాక్షాత్తు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఒకరంటే మరొకరికి పొసగడం లేదు.
ఇక్కడ ఒకటి రెండు మండలాల్లో పార్టీలో కుమ్ములాటలు వైసీపీకి అనుకూలంగా మారాయి.చంద్రబాబు సొంత ఇలాకాలోనే టీడీపీలో కుమ్ములాటలు వైసీపీకి ప్లస్ అవుతున్నాయి.
మరి బాబు వీటిపై ఇప్పటికైనా దృష్టి సారించకపోతే వచ్చే ఎన్నికల్లోను టీడీపీ నష్టపోవడం ఖాయం.