ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.భూమా మృతి తర్వాత టీడీపీ టిక్కెట్టు కోసం ఇక్కడ భూమా ఫ్యామిలీ వర్సెస్ శిల్పా మధ్య ఫైటింగ్ నడిచింది.
శిల్పా మోహన్రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఇక్కడ టీడీపీ టిక్కెట్టు ఎంపికలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి తగ్గినట్లయ్యింది.
ఇక ఇప్పుడు టీడీపీలో టిక్కెట్టు కోసం భూమా ఫ్యామిలీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు భూమా చిన్న కుమార్తె మొనికారెడ్డి మాత్రమే పోటీలో ఉన్నారు.
వీరిలో భూమా అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా డెసిషన్ తీసుకన్నట్టే తెలుస్తోంది.బ్రహ్మానందరెడ్డి అయితేనే శిల్పా మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనగలరని భావిస్తున్నారు.
కొద్ది రోజులుగా అఖిలప్రియ భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో బాగా ప్రమోట్ చేస్తున్నారు.సోదరుడు తనకు అండగా ఉంటే వచ్చే ఎన్నికల్లో నంద్యాలతో పాటు ఆళ్లగడ్డలోను గెలవవచ్చనేది అఖిలప్రియ ధీమా.
అఖిలప్రియకు రాజకీయంగా అనుభవం తక్కువ కావడంతో ఆమె వ్యూహాలు పన్నడంలో కాస్త వెనకపడుతున్నారన్న టాక్ ఉంది.ఈ క్రమంలోనే గత రెండు దశాబ్దాలుగా భూమాతోనే నడుస్తోన్న బ్రహ్మానందరెడ్డి అండ ఆమెకు ఉంటే ఈ రెండు నియోజకవర్గాల్లోను వాళ్లకు సరైన పట్టు ఉన్నట్లు ఉంటుంది.
బ్రహ్మానందరెడ్డి వైసీపీ నేత కాటసాని రాంరెడ్డి అల్లుడు కావడంతో వైసీపీ క్యాడర్ కూడా కొంత అనుకూలంగా పనిచేస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఇక శిల్పా మోహన్రెడ్డి పార్టీ మారినా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలోనే ఉండడంతో శిల్పా వర్గం కూడా కొంతమంది ఆయన వెంట టీడీపీలోనే ఉండిపోయారు.
ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి రానున్నాయి.ఈ క్రమంలోనే బ్రహ్మానందరెడ్డి అయితేనే వైసీపీనీ ధీటుగా ఎదుర్కొంటారని భావించిన చంద్రబాబు ఆయన్నే రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.