రాజకీయాల్లో వారసత్వం కామన్.ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులు తమ వారసులను సైతం రాజకీయారంగ్రేటం చేసేందుకు, వారికి తాము పదవిలో ఉండగానే బలమైన పునాది వేసే ప్రయత్నాలు చేస్తుంటారు.
ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయారంగ్రేటం చేయించేందుకు అప్పుడే తెరవెనక వర్క్ స్టార్ట్ చేసేశారు.తాజాగా జరిగిన మహానాడులో సైతం ఈ వారసుల హంగామా ఎక్కువగానే కనపడింది.
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇప్పటికే ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు.దీంతో ఇప్పుడు మిగిలిన సీనియర్ నేతలు సైతం తమ వారసులను లైన్లో పెడుతున్నారు.
మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో రాప్తాడు, పెనుగొండ, ధర్మవరంలలో ఎక్కడో ఓ చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక జేసీ బ్రదర్స్ తనయులు కూడా అనంతపురం ఎంపీ, తాడిపత్రి, అనంతపురం అర్బన్ సీట్లపై కన్నేసినట్టు టాక్.
ఇక దివంగత ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్నాయుడు ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్, గాలి ముద్దుకృష్ణమ కుమారుడు భాను, కళా వెంకట్రావు కుమారుడు మల్లిక్, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కుమారుడు ప్రసన్న, అయ్యన్న పాత్రుడి తనయుడు విజయ్, శిల్పా మోహనరెడ్డి కుమారుడు రవి, కేఈ కుమారుడు శ్యాంబాబు, గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, దేవినేని ఉమా కుమారుడు నిహార్ తదితరులు కూడా మహానాడులో సందడి చేశారు.
వీరిలో గాలి తనయుడు భానుకు వచ్చే ఎన్నికల్లో నగరి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.అయ్యన్న కుమారుడు విజయ్ సైతం నర్సీపట్నం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు.
కేఈ కుమారుడు శ్యాంబాబుకు వచ్చే ఎన్నికల్లో పత్తికొండ సీటు ఖరారైంది.కేఈ వయోభారంతో చంద్రబాబే శ్యాంబాబుకు లైన్ క్లీయర్ చేసేశారు.
ఏదేమైనా 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో వారసుల హంగామనే ఎక్కువుగా కనపడేలా ఉంది.చంద్రబాబు తనయుడు లోకేశ్ ఆధ్వర్యంలో వీరంతా ఓ టీంగా టీడీపీ రాజకీయాలను శాసించనున్నారు.