తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు దెబ్బకు అన్ని పార్టీలు విలవిల్లాడుతున్నాయి.కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్తో ఎప్పుడు తమ పార్టీ నుంచి ఎవరు అధికార టీఆర్ఎస్లోకి వెళ్లిపోతారో కూడా ఎవ్వరికి తెలియడం లేదు.
ఇవన్నీ ఇలా ఉంటే అక్కడ టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ దెబ్బకంటే అంతర్గత కోట్లాటలతో రోజు రోజుకు తనంతట తానుగానే బలహీనపడుతోంది.
ప్రస్తుతం టీ కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.
తెలంగాణలో కొత్త జిల్లాల్లో ఇప్పటకీ చాలా చోట్ల డీసీసీ నియామకాలు జరగలేదు.ఉత్తమ్కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతున్నా…ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి.
తాజాగా కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక టీ కాంగ్రెస్లో సెగలు రేపుతోంది.
పాత 10 జిల్లాలను పక్కన పెడితే కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరగనుంది.
ఇక్కడే పార్టీలో ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయ్యింది.ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల్లో ఈ అధ్యక్షుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు.
కరీంనగర్లో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కటకం మృత్యుంజయం స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి అడుగుతున్నారు.కౌశిక్ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు.
ఆయన మద్దతు మృత్యుంజయకే ఉంది.
ఈ రెండు గ్రూపులు ఇలా ఉండగానే మాజీ ఎంపీ చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి, బొమ్మ శ్రీరామ్ తాము సైతం రేస్లో ఉన్నామంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాలలో అయితే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే గెడ్డం అరవింద్రెడ్డి తమ వర్గాలకు డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
వరంగల్ జిల్లా నుంచి ఏర్పడ్డ భూపాలపల్లిలో మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తన భార్య గండ్ర జ్యోతికి డీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతుంటే జ్యోతికి వ్యతిరేకంగా మరికొందరు పావులు కదుపుతున్నారు.
వరంగల్ అర్బన్లో ఎర్రబెల్లి స్వర్ణ వర్సెస్ దయకార్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.వరంగల్ రూరల్లో పరకాల వెంకట్రామిరెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు.
మహబూబాబాద్లో ఏకాభిప్రాయం రావడంతో భరత్ చంద్రారెడ్డి పేరు అధికారికంగా ఖరారైంది.ఖమ్మం జిల్లాలో మూడు ముక్కలాట కొనసాగుతోంది.
రేణుకాచౌదరి – భట్టి విక్రమార్క – పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరికి వారు తమ వర్గానికి డీసీసీ పోస్టు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతూ పోరును రంజుగా మార్చేశారు.కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు తనయుడు రాఘవ పోటీపడుతుండగా, రేణుక తన అనుచరుడు ఎడవెల్లి కృష్ణ కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
ఏదేమైనా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక మహా సంగ్రామాన్ని తలపిస్తోంది.ఇక్కడ రాజకీయాలు సీనియర్ నేతల మధ్య కరవమంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారాయి.