ఏపీ పాలిటిక్స్లో సోషల్ వార్ షురూ అవుతోందా? అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య యుద్దానికి సోషల్ మీడియా వేదిక కానుందా? అంటే ఔననే సంకేతాలే వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు మీడియా ఎదుట తిట్లు పంచాంగాలతో పొద్దు పుచ్చిన వైసీపీ, టీడీపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ దుమ్మెత్తి పోసుకునేందుకు రెడీ అయ్యాయి.
వాస్తవానికి భావ ప్రకటనా స్వేచ్ఛకు పర్యాయంగా ఉన్న సోషల్ మీడియా.అనేక మంది అభిప్రాయాలకు సాధనంగా మారింది.
తమ అభిప్రాయాన్ని చెప్పడానికి అనేక మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.2014 ఎన్నికల సమయంలో బలమైన ప్రచార సాధనంగా ఉన్న సోషల్ మీడియా రానురాను పార్టీల వారీగా విభజన రేఖలకు గురైంది.ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ అనే రెండు చానెళ్లు పురుడు పోసుకున్నాయి.తొలి నుంచి వైసీపీ ఫేస్బుక్ ద్వారా అభిమానులను సంపాయించుకుంటోంది.ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వంపై ఇటీవల కాలంలో సోషల్ వేదికగా అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక, సీఎం తనయుడు లోకేశ్ మంత్రి అయ్యాక ఆయన ప్రతి మాటా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆయన తెలిసి అన్నా.తెలియక అన్నా మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన చేసే ప్రతి కామెంట్కి సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ వినిపిస్తోంది.
అయితే, ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు సోషల్ కామెంట్లపై కన్నెర్ర చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన ధాటిని మరింత పెంచిన వైసీపీ.
సోషల్ మీడియాలో టీడీపీపై రెచ్చిపోవాలని ప్రజలకు పిలుపు నిచ్చింది.
ఇక ఈ విషయంలో టీడీపీ కూడా వేగంగా పావులు కదుపుతోంది.
సోషల్ మీడియా కోసం 50 నుంచి 60 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు టీడీపీ సిద్ధమైందని ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయపడ్డారు.సో.మొత్తానికి సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలూ రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.