ఒకప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలంటే, ఆరోజు దాటి తెల్లరితే కాని తెలిసేది కాదు.న్యూస్ పేపర్ మాత్రమే చూపుకి సమాచారం అందించేది.
రేడియో అందుబాటులో ఉన్నా, సమాచారం విని ఇలా జరగొచ్చు, అలా జరగొచ్చు అని ఊహించుకోవడమే.టీవి వచ్చకా పరిస్థితి మారింది.
వార్తలు త్వరగా తెలిసేవి.కాని మనకు కావాల్సిన వార్త రావడం, రాకపోవడం మన అదృష్టాన్ని బట్టి ఉండేది.24 గంటలు వార్తలు ప్రసారం చేసే ఛానెల్స్ వచ్చినా, ఏదో లోటు.
ఇక ఇంటర్నెట్ వచ్చాకా ప్రపంచం మొత్తం మారిపోయింది.
ఇంట్లో కంప్యూటర్, దానికో నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎక్కడి వార్తైనా, ఏ వార్తైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, చూడవచ్చు.స్మార్ట్ ఫోన్ వచ్చాకా ఇంట్లో ఉండాల్సిన కంప్యూటర్ కాస్త సైజ్ మారి చేతిలో పడ్టట్టు అయ్యింది.
యువత టీవీలు చూడటం మానేసి, స్మార్ట్ ఫోన్ వెంటపడ్డారు.ఏ వార్త తెలుసుకోవాలన్నా ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వైపే చూస్తున్నారు.
18-24 ఏళ్ళ మధ్య యువతీయువకుల మీద తాజాగా జరిగిన సర్వేలో మనకు ఆల్రెడి తెలిసిన విషయాలే బయటపడ్డాయి.టీవిలో కన్నా, సోషల్ మీడియాలో వార్తలు తెలుసుకునేవారు ఎక్కువున్నారు యూత్ లో.26 దేశాల్లో జరిగిన ఈ సర్వేలో 28% మంది సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకుంటోంటే, 24% మంది టీవి ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకుంటున్నారు.
ఇక వార్తల కోసం అత్యధికంగా వాడుతున్న సైట్ ఫేస్ బుక్, ఆ తరువాత యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వరుసగా ఉన్నాయి.