ప్రయోగం అంటే కొత్త పని చేయడం.కొత్త ఆలోచన అమలు చేయడం.
యోగం అంటే మంచి జరగడం.తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై విమర్శల సంగతి అలా పక్కన పెడితే కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి.
కొత్త ఆలోచనలు చేస్తున్నారు.ముఖ్యంగా మహిళల విషయంలో కేసీఆర్ ఆలోచనలు అభినందించాల్సందే.
ఆయన తన మంత్రి వర్గంలోకి మహిళలను తీసుకోకపోయినా సాధారణ మహిళల కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు.పోకిరీలు, ఈవ్ టీజర్ల నుంచి మహిళలను రక్షించడానికి ‘షీ టీమ్్స’ ప్రయోగం చేశారు.
ఇది చక్కటి ఫలితాలు ఇస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది.మొన్న కూడా మహిళలను వేధిస్తున్న కొందరు పోకిరీలను అరెస్టు చేసి వారి ఫొటోలు కూడా పేపర్లలో ప్రచురించారు.
దీంతో వారి పరువు పోయినట్లే కదా.వీరిలో టీనేజర్ల నుంచి నడి వయసు వారు కూడా ఉన్నారు.వీరిని అరెస్టు చేసి జైల్లో పెట్టకుండా కౌన్సెలింగ్ ఇచ్చి బ్రెయిన్ వాష్ చేయడం మంచి విధానం.ఇక హైదరాబాద్ నగరంలో ఐటీ రంగంలో వేలాది మంది మహిళలు పని చేస్తున్నారు.
వారి పని వేళలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.అర్థరాత్రి, తెల్లవారుజామున ఇంటికి రావల్సిన పరిస్థితి.
కంపెనీ వాహనాలు లేనివారు ప్రయివేటు టాక్సీల్లో (క్యాబ్్స) రావల్సిందే.దీంతో కొందరు డ్రైవర్లు పోకిరీలతో కలిసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటివారి నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘షీ ట్యాక్సీ’ లు ప్రవేశపెట్టింది.అంటే ఈ వాహనాలు నడిపేది మహిళలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.ఈ నెల (ఆగస్టు) పదిహేనో తేదీ నుంచి షీ ట్యాక్సీలు హైదరాబాద్ రోడ్ల మీదకు రాబోతున్నాయి.మొదటి దశలో పన్నెండు వాహనాలు ప్రారంభమవుతాయి.
తర్వాత యాభై టాక్సీలు నడుస్తాయి.మొత్తం వంద ట్యాక్సీలు నడపాలని ప్లాన్ చేశారుగాని మహిళా డ్రైవర్లు తక్కువగా ఉన్నారట.
రవాణా శాఖ ఆధ్వర్యంలోనే పద్దెనిమిది మంది మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చారు.వారిలో పన్నెండు మందికి టాక్సీలు కేటాయించారు.
ఈ ట్యాక్సీలు ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లోనే పని చేస్తాయి.ఐటీ ఉద్యోగినులకు సేవలు అందించాలనేదే ప్రధాన లక్ష్యం కాబట్టి.
షీ ట్యాక్సీల కోసం తెలంగాణ ప్రభుత్వం ముప్పయ్ఆరు లక్షలు కేటాయించింది.మారుతీ డిజైర్ వీడీఐ కార్లను షీ ట్యాక్సీల కోసం ఎంపిక చేశారు.
ఇవి తెలుపు, గులాబీ కాంబినేషన్లో ఉంటాయి.ఐటీ మహిళలు భయం లేకుండా వీటిల్లో ప్రయాణించి ఇళ్లకు చేరుకోవచ్చు.
మహిళల రక్షణ కోసం ఇకముందు కూడా ప్రయోగాలు జరగాలి.