అడవుల్లో లక్ష కోట్ల సంపద ఉందా? అడవుల్లో ఉండటమేమిటి? ఉంటే బ్యాంకుల్లో ఉండాలి లేదా నల్ల వ్యాపారుల దగ్గర లేదా బడా పెట్టుబడిదారుల దగ్గర ఉండాలి.అడవుల్లో ఎందుకుంటుంది? అనుకుంటున్నారు కదా.అడవులు కూడా దేశ సంపదే కదా.ప్రకృతి వనరులన్నీ దేశాన్ని సుసంపన్నం చేసేందుకు ఉపయోగపడేవే.ఈమధ్య ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో ఇరవైమంది ఎరచ్రందనం దొంగల ఎన్కౌంటర్ జరగడంతో శేషాచలం పేరు బాగా పాపులర్ అయింది.స్మగ్లర్లు దోచుకోగా ఇప్పటికీ ఈ అడవుల్లో ఉన్న ఎర్ర చందనం విలువ ఎంతో తెలుసా? లక్ష కోట్ల రూపాయలు.ఇతర వృక్షజాతుల విలువ కాకుండా కేవలం ఎర్రచందనం విలువే ఇంత ఉందన్నమాట.ఎన్కౌంటర్ తరువాత ఎస్టిఎఫ్ అధికారులు, అటవీ నిపుణులు కలిసి శేషాచలంలోని ఎర్రచందనంపై పరిశోధన చేస్తే అనేక విషయాలు తెలిశాయి.
గత దశాబ్ద కాలంలో స్మగ్లర్లు ఈ అడవి నుంచి తరలించిన ఎర్రచందనం విలువ దాదాపు పన్నెండు వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.ఎర్రచందనం నరికేవారు, ఆ దుంగలను వాహనాల వద్దకు తరలించేవారు, వాహనదారులు, వీరికి తోడు మావోయిస్టులు…ఇలా అందరూ శేషాచలం అడవులను ధ్వంసం చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఎందరో పెద్దలు ఉన్నారు.వీరిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినిమా యాక్టర్లు, ఇంకా అనేక రంగాలకు చెందినవారున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇకనైనా విలువైన ఎర్రచందనాన్ని దొంగలపాలు కాకుండా కాపాడకుంటేనే ఆ వృక్షజాతి మనగడలో ఉంటుంది.భావితరాలకు అందుబాటులో లేకుండాపోతుంది.